టిక్‌టాక్‌తో యువతకు ఐసిస్‌ వల | In Order To Attract Youth ISIS Chose Tik Tok | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌తో యువతకు ఐసిస్‌ వల

Oct 23 2019 7:20 PM | Updated on Oct 23 2019 8:54 PM

In Order To Attract Youth ISIS Chose Tik Tok - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ (ఐసిస్) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. యువత విశేషంగా వాడుతున్న టిక్‌టాక్‌ ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.  500 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్న టిక్‌టాక్‌ను వేదికగా చేసుకుని 16 - 24 సంవత్సరాల వయసున్న యువతకు ఐసిస్‌ వల వేస్తున్నట్టు వెల్లడైంది. చిన్న చిన్న వీడియోలను పోస్ట్‌ చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసిస్‌ సంబంధిత అకౌంట్ల నుంచి ఈ వీడియోలు పోస్ట్‌ చేసినట్టు గుర్తించిన టిక్‌టాక్‌ ఈ ఖాతాలను తొలగించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది.

సిరియా నుంచి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐసిస్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్‌ చేసేందుకు టిక్‌టాక్‌ను వేదికగా వాడుకుని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న రెండు డజన్ల ఖాతాలను గుర్తించి శాశ్వతంగా తొలగించినట్టు టిక్‌టాక్‌ ప్రకటించింది. ఐసిస్‌ సాగిస్తున్న ప్రచారం తమ కంపెనీ నియమాలకు విరుద్ధమని, ఉగ్రవాద వీడియోలను తమ మాధ్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది.

అయితే  అత్యధిక యూజర్లను కలిగియున్న భారత్‌లోనూ టిక్‌టాక్‌ పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైబర్ వేధింపులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించడంతో పాటు కొన్ని వారాలపాటు నిషేధించింది. టిక్‌టాక్ మాధ్యమంగా #ఆరెస్సెస్‌, #రామమందిరం, #హిందూ, #బీజేపీ వంటి హాష్‌ ట్యాగ్‌లను ఉపయోగించి కొందరు హిందు అతివాదులు విద్వేషపూరిత వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఒక్క భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ సవాళ్లు ఎదుర్కొంటొంది. ఇరవైకి పైగా దేశాలలో టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement