ఆ సైట్‌ను హ్యాక్‌ చేస్తే 1,50,000 డాలర్లు

ఆ సైట్‌ను హ్యాక్‌ చేస్తే 1,50,000 డాలర్లు

వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ (డీవోడి) తన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో పరీక్షించాలనుకుంటోంది. దీని కోసం హ్యాకర్లను ఆహ్వానిస్తోంది. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్‌చేసి అందులో లోపాలను కనిపెట్టిన వారికి 1,50,000 డాలర్ల రివార్డును ప్రకటించింది. తమ ఈ ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ ఏప్రిల్ 18వ తేదీ నుంచి ప్రారంభమై మే నెల 12వ తేదీ వరకు కొనసాగుతోందని, ఈ మధ్యకాలంలోనే హ్యాకర్లు తమ సైట్‌ను హ్యాక్ చేయాల్సి ఉంటుందని రక్షణ మంత్రి ఆశ్ కార్టర్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.



అమెరికా సామాజిక భద్రత నెంబర్ ఉన్న హ్యాకర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని, వారి నేర చరితను పరిశీలించేందుకు కూడా అంగీకరించాలని షరతు విధించారు. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను కనుగొనేందుకు ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి బగ్ బౌంటీ పోటీలను నిర్వహించాయి. ఇటీవల ఊబర్ సంస్థ కూడా తమ టాక్స్ యాప్‌లో లోపాలను కనుగొనేందుకు ఇలాంటి పోటీనే ఆహ్వానించి పదివేల డాలర్ల రివార్డును ప్రకటించింది.
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top