చంద్రబాబే అసలైన ఫ్యాక్షనిస్టు | Sakshi
Sakshi News home page

చంద్రబాబే అసలైన ఫ్యాక్షనిస్టు

Published Wed, Feb 8 2017 1:36 AM

చంద్రబాబే అసలైన ఫ్యాక్షనిస్టు - Sakshi

ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసలైన ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబును ఎన్టీఆర్‌ గాడ్సేతో పోల్చారని, దానికన్నా జగన్‌ తక్కువ మాట (ముఖ్య‘కంత్రి) అన్నారని టీడీపీ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై, ప్రత్యేకించి రాయలసీమపై ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఉరవకొండ ధర్నాతో టీడీపీ పునాదులు కదులుతున్నాయన్న భయంతో ఎప్పుడూ కలవని టీడీపీ నేతలు వైఎస్‌ జగన్‌ను ఫ్యాక్షనిస్టుతో పోల్చడంపై అగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ‘మనసులో మాట’ అనే పుస్తకంలోని మాటల్ని మాత్రమే జగన్‌ ఉదహరించారని, దాన్ని మంత్రులు తప్పుపట్టడం హాస్యాస్పదమన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కానీ, ఆయన కుమారుడు  జగన్‌ గానీ ఏది చెబుతారో, అది చేసి చూపిస్తారని చెప్పారు. అంతే కానీ టీడీపీ నేతల్లా ప్రజల సొమ్మును దోచుకుంటూ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయరని విమర్శించారు.  ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌ పుణ్యమే అని ప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు.   తెలుగుగంగను ఎన్టీఆర్‌ మానసపుత్రికగా చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ఆ ప్రాజెక్టులో అత్యధిక శాతం పనులు చేసింది వైఎస్సార్‌ అనే సంగతి తెలుసుకుంటే మంచిదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement