
గద్దర్, అందెశ్రీ ఈర్ష్య పడ్డారు
మానకొండూరు శాసనసభ్యుడిగా తాను ఎన్నికయ్యానని గద్దర్ అసూయకు గురయ్యారని..
అందుకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నాతో మాట్లాడలేదు: బాలకిషన్
సాక్షి, హైదరాబాద్: మానకొండూరు శాసనసభ్యుడిగా తాను ఎన్నికయ్యానని గద్దర్ అసూయకు గురయ్యారని.. అందుకే ఆయన తనకు ఫోన్ కూడా చేయడం మానేశారని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఇదే కారణంతో అందెశ్రీ కూడా రెండేళ్లుగా మాట్లాడలేదని అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఈర్ష్యద్వేషాలు పక్కనపెట్టి, దళితులంతా కలసి పోరాడి హక్కులు సాధించుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు సుంకపాక దేవయ్య మాదిగ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక గౌరవాధ్యక్షుడు ఎం. విజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రామలక్ష్మణ్, ఉత్సవాల కమిటీ చైర్మన్ దండు నరేంద్ర మాదిగ, దళిత నాయకుడు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు.