
నాయకుడు అంటే ఇలా ఉండాలి
బుగ్గకారులో తిరుగుతూ జనానికి బూడిద మిగిల్చే నేతలకు బైబై. ఏసీ రూముల్లో కూర్చుని మాటలతో మసిపూసి మారేడు కాయ చేసే మాయగాళ్లకు బైబై.
బుగ్గకారులో తిరుగుతూ జనానికి బూడిద మిగిల్చే నేతలకు బైబై. ఏసీ రూముల్లో కూర్చుని మాటలతో మసిపూసి మారేడు కాయ చేసే మాయగాళ్లకు బైబై. పండుటాకుల పాలిట పెద్దకొడుకులా మారేవాడు, ఆడపడచులను అన్నయ్యలా కాచుకునేవాడు, చిన్నారుల చదువులో చిగురించే రేపటిని దర్శించేవాడు, యువతరంతో మమేకమయ్యేవాడు, కష్టజీవుల కన్నీళ్లు తుడవడమే తొలికర్తవ్యంగా భావించేవాడు...
ఎంతటి కష్టమొచ్చినా ప్రతిఒక్కరికీ ‘తానున్నా’ననే భరోసా ఇవ్వగలిగిన సత్తా ఉన్నవాడు... అతడే అతడే మా నాయకుడు.... అని తేల్చి చెబుతున్నారు యువత. అలాంటి నేతనే ఎన్నుకుంటామని ఢంకా భజాయిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలువురు యువతీ యువకులతో మాట్లాడినప్పుడు... వారు వెలిబుచ్చిన అభిప్రాయాల
సారాంశం ఇదే...
నిస్వార్థపరుడే ప్రజానాయుకుడవుతాడు..
రాజకీయాల్లోకి రావడం గొప్పకాదు... కలకాలం నిలబెట్టుకోవడంలోనే ఉంది గొప్పతనం అంతా. అది ప్రజల గుండెలోతుల్లో చిరస్థాయిగా నిలవగలిగే పనులు చేసినప్పుడే సాధ్యపడుతుంది. భారతదేశంలో 70 శాతం పైగా వ్యవసాయంపై ఆధారపడ్డ వారే. అలాంటి రంగం నేడు ఎలా ఉంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పాలకుల వైఫల్యం కాదా? జపాన్, జర్మనీ వంటి దేశాల్ని చూస్తే అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారుు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే భారత్ను చెప్పుకోవాల్సిన దుస్థితి.
అందుకే వునకు సరైన నాయుకత్వం అవసరం. ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు లబ్ధిదారులకు చేరుతున్నాయూ... అనే సమీక్ష జరపాలి. నిజమైన పేదలకు న్యాయం జరగాలి. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు తొమ్మిది వేల రూపాయల స్కాలర్షిప్ అన్నారు. ఐదు వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా నాలుగు వేలు ఏమైనట్లు? ఇటీవల గ్యాస్ ఆధార్ లింక్ అన్నారు. వినియోగదారులను ముప్పుతిప్పలు పెట్టారు. మళ్ళీ ఆ లింక్ను తీసేశారు. ఇలాంటి చర్యలు అవగాహనా రాహిత్యాన్ని నాయకత్వ లోపాన్నే సూచిస్తారుు. పదవిపై ఏమాత్రం వ్యామోహం లేకుండా నిరంతరం ప్రజల గురించి ఆలోచించేవాడే ప్రజానాయకుడవుతాడు.
- శృతి, చార్డెడ్ అకౌంటెంట్
వూర్పును తెచ్చే నాయుకుడు రావాలి..
సమాజంలో పేద, ధనిక, కుల, మత విద్వేషాలు ఉన్నాయంటే అది పాలకులు తమ స్వార్థానికి సృష్టించినవే. ప్రజాభీష్ట పాలన అంటే ఎలాంటి తారతమ్యాలు లేకుండా చూడడమే. పొరుగు దేశాలతో పోలిస్తే మన దేశం వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం లంచగొండితనం. ఉన్నవాడు లంచం ఇచ్చి పనులు చేసుకుంటున్నాడు. పేదవాడు మరింత పేదరికంలో మగ్గుతున్నాడు. పాలక వర్గ్గాలు సైతం దీనిని ప్రోత్సహించడం మన దౌర్భగ్యం. సమాజంలో ఈ పరిస్థితి మార్చే నాయకత్వం రావాలి. రిజర్వేషన్లకు ఒక పరిమితి ఉంటే మంచిది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ దిశగా ఆలోచించే నాయకగణం రావాలి. ఓట్లు అడిగేందుకే కాకుండా ఎల్లవేళలా ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలను తెలుసుకుని సమకూర్చే నేతలు కావాలి. - ఆపేక్ష సరస్వతి, సాఫ్ట్వేర్
మహిళలకు రక్షణనిచ్చే నాయకత్వం..
చట్టాలను పకడ్బందీగా అమలుపరిచే నాయకత్వమే మనకు లేదు. చట్టాల్లో ఉన్న లొసుగులతో దుర్మార్గులు కూడా ఎలాంటి శిక్షలు లేకుండా దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు. ముఖ్యంగా యువతులపై జరుగుతున్న దుస్సంఘటనలు బాధాకరం. నిందితులను పట్టుకొని శిక్షిస్తున్న దాఖలాలు బహుస్వల్పం. ఒకవేళ పట్టుకొని జైలుకు పంపించినా మళ్ళీ బెయిల్పై వచ్చి తమకేంటి అడ్డు అన్న రీతిలో తిరుగుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటున్నామే తప్ప వున మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఈ నేతలు అరికట్టలేరా? మహిళా భద్రతకు ప్రాధాన్యమిచ్చే నాయకత్వం కావాలి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలు పెట్టే గెలవచ్చన్న రాజకీయ వ్యవస్థ నశించాలి. - చాముండేశ్వరి, విద్యారి
జవాబుదారీతనమే నాయుకత్వ లక్షణం..
సమాజంలో ప్రజలందరికీ జవాబుదారీగా ఉండడమే నిజమైన నాయకుడి లక్షణం. కానీ అలాంటి నాయకుడు ఈ రోజుల్లో కరువయ్యాడు. సమాజానికి, రాజకీయాలకు మధ్య అంతరాన్ని పెంచేశారు. ఏదో ఎన్నికలప్పుడు తప్ప ప్రజలతో రాజకీయ నాయకులు సత్సంబంధాలు నడపడం మానేశారు. దీంతో ప్రజలు కూడా రాజకీయ నాయకులపై అసహ్యం పెంచుకుంటూపోతున్నారు. ప్రజలు పట్టించుకోవడం లేదు కదా....మేం చెప్పిందే వేదం, మేమే కింగ్లం అన్న స్థాయికి నాయకులు వెళ్ళిపోయారు. ఏ పని చేయాలన్నా తమకు కమీషన్ రావాల్సిందే అన్న ధోరణి పెరిగిపోయింది. అంతటితో ఆగకుండా స్కాములకు పాల్పడుతున్నారు. ఇటీవల దేశంలో జరిగిన స్కాములే ఇందుకు నిదర్శనం. ఈ ధోరణి దేశాభివృద్ధికి పెద్ద అవరోధంగా మారుతోంది. అందర్ని సవుదృష్టితో పాలించే నాయకత్వం వస్తే బాగుంటుంది.