
సరికొత్తగా ‘108’ అంబులెన్స్లు
‘108’ కొత్త అంబులెన్స్ కొత్త వాహనాలు 145 త్వరలో రోడ్డెక్కనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ‘108’ కొత్త అంబులెన్స్ కొత్త వాహనాలు 145 త్వరలో రోడ్డెక్కనున్నాయి. మొత్తం 290 వాహనాలకు టాటా మోటార్స్ లిమిటెడ్ టెండర్ దక్కించుకున్నప్పటికీ అందులో 145 వాహనాలను మాత్రమే ఆ కంపెనీకి అప్పగించాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. మిగిలిన 145 వాహనాలకు రెండో విడత టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే మొత్తం వాహనాలకు టెండర్ దక్కించుకున్న టాటా మోటార్స్కు సగమే ఎందుకు అప్పగించారన్న విషయంపై చర్చ జరుగుతోంది.
టెండర్ నిబంధనల ప్రకారం సంఖ్యపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే నెల రోజుల నుంచి వాహనాల సరఫరాను ప్రారంభించాలని... అప్పటినుంచి 90 రోజుల్లోగా మూడు దశల్లో అన్నింటినీ సరఫరా చేయాలని టాటా మోటార్స్ను ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త వాహనాల్లో 10 అంబులెన్స్లు ప్రత్యేకంగా పిల్లల కోసం కేటాయించారు.
అనేక ప్రత్యేకతలు...
ఈ-టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొనగా ఒక్కో వాహనానికి రూ. 9.32 లక్షలు కోట్ చేసిన టాటా మోటార్స్కు అప్పగించారు. గతంలో భారత స్టాండర్డ్ (బీఎస్-3) వాహనాలు ఉండగా... ఇప్పుడు బీఎస్-4 స్టాండర్డ్ వాహనాలను అందించనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో పాటు వాహనాలన్నింటికీ ట్యూబ్ లెస్ టైర్లు ఏర్పాటు చేస్తారు. బ్రేక్ వేసినప్పుడు రోగికి ఇబ్బంది కలగకుండా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)ను ఏర్పాటు చేస్తారు. అలాగే ఆటోమెటిక్ వెయికిల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏవీటీఎస్)ను ఏర్పాటు చేయనున్నారు.
దీంతో వాహనం ఎక్కడుందో నేరుగా కంట్రోల్ రూం నుంచి ఆన్లైన్లో వీక్షించవచ్చు. వాహనం ఎక్కడుంది... దాని వేగం... చేరుకున్న సమయం... ఆసుపత్రికి చేర్చిన సమయం అంతా రికార్డు అవుతుంది. వీటిలో కొన్ని వాహనాలకు ఐసీయూ వసతి ఉంటుంది. గుండె నొప్పి తదితర రోగులను తరలించే సంద ర్భంలో అందించాల్సిన అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇందులో ఉంటాయి. అదనంగా రక్తపు బాటిళ్లను అందుబాటులో ఉంచుతారు. గర్భిణిలను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలిస్తారు. ప్రసవం అనంతరం కూడా వారిని ఇంటికి పంపించే నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించారు.