‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ | five-member committee on krishna river water dispute | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ

Dec 21 2016 3:25 AM | Updated on Sep 4 2017 11:12 PM

‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ

‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ

కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జల వనరుల శాఖ
గతంలో రాష్ట్రం అభ్యంతరం తెలిపిన సభ్యుల తొలగింపు
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి, గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపు అంశాలపై అధ్యయనం
90 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచన


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కృష్ణా జలాల నిర్వహణ ఎలా ఉండాలో తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిం చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్‌ చైర్మన్ గా సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎం.గోపాలకృష్ణన్, రూర్కీ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌పీ పాండే, చీఫ్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌ కుమార్‌ శుక్లా, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్‌ ఎన్ఎన్ రాయ్‌ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీ మనోజ్‌ శర్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్‌–1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేస్తుంది.

ఈ అంశాలపై అధ్యయనం చేసి అందించే నివేదిక, సూచించే విధానానికి అనుగుణంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నడుచుకోనుంది. ఈ కమిటీ తన నివేదికను 90 రోజుల్లో కేంద్ర జల వనరుల శాఖకు అందించాల్సి ఉంటుంది. కమిటీ అధ్యయనానికి అవసరమైన సంపూర్ణ సహకారం, సమాచారాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సి ఉంటుంది. కమిటీ అవసరమనుకుంటే సీడబ్ల్యూసీ, ఇతర రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల సహకారాన్ని సైతం తీసుకుంటుంది.

ఆ సభ్యుల తొలగింపు..
నిజానికి కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కమిటీని నియమిస్తామని జూన్ 21, 22 తేదీల్లో జరిగిన కేంద్ర జల వనరుల శాఖ సమావేశంలోనే నిర్ణయం జరిగింది. దీనికి అనుగుణంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ మొహిలే అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలోని ఇద్దరు సభ్యులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. గత కమిటీలో ఉన్న మొహిలే రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్‌ మెంబర్‌గా పని చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఏకపక్షం గా ఉందని తెలంగాణ ఫిర్యాదు చేసింది.

ఇక మరో సభ్యుడిగా ఉన్న ఎంకే గోయల్‌ రూర్కీ నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీలో శాస్తవేత్తగా ఉంటూ, కృష్ణా బేసిన్ లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలం గాణకు సంబంధం లేని తటస్థ నిపుణులతో కమిటీని వేయాలని తెలంగాణ సూచించగా, అందుకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement