
బాలికపై నలుగురు ఆటో డ్రైవర్ల అత్యాచారం!
నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినా బాలికలు, యువతులపై అత్యాచారాలు రోజురోజుకు అధికమవుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినా బాలికలు, యువతులపై అత్యాచారాలు రోజురోజుకు అధికమవుతూనే ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్లు తరచూ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. జూబ్లీహిల్స్లో అటువంటి దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై నలుగురు ఆటో డ్రైవర్లు సామూహికంగా అత్యాచారం చేశారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం మొదట ఒక డ్రైవర్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ బాలికతో శారీరకంగా కలసిన దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఆ దృశ్యాలను చూపించి, బెదిరిస్తూ తరచూ బాలికపై ఆ డ్రైవర్ అత్యాచారం చేసేవాడు. తరువాత బాలికను ఆ డ్రైవర్ తనతో తీసుకు వెళ్లాడు. ఆ డ్రైవర్తోపాటు అతని మిత్రులైన మరో ముగ్గురు మొత్తం నలుగురు డ్రైవర్లు బాలికపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. చివరకు విషయం తెలియడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.