జనధాత్రిపై జగన్‌ కేతనం

Imam Story On YS Jagan Mohan Reddy Birthday - Sakshi

నేడు వైఎస్‌ జగన్‌ జన్మదినం

జననేత వైఎస్‌ జగన్‌ జన్మదినం నేడు. ఓ ఉత్సాహం... పట్టుదల, పోరాటాల బాట, అకుంఠిత దీక్షకు సంకేతం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తెలుగు ప్రజలకు ఆయన ఒక ఆశాజ్యోతి. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని ఎదిగిన పోరాట యోధుడు జగన్‌. ఒకానొక సందర్భంలో ఆళ్లగడ్డ బహిరంగ సభలో ప్రసంగిస్తూ తనపై దాడి చేయవచ్చని తన కాళ్లు, చేతులు విరగ్గొట్ట వచ్చని తనను విగతజీవిని చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చని.. అయినా, తాను సముద్రం లోని కెరటంలా ఉవ్వెత్తున ఎగసిపడుతూ మళ్లీ ప్రజ లతో కలసి పోరాటం చేస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

నేడు జన్మదినం జరుపుకుంటున్న జగన్‌ను భారత న్యాయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని రీతిలో 16 నెలలు బెయిల్‌ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఆయనను నిర్బంధించాయి. ఒకవైపు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ వైఎస్సార్‌సీపీని బలమైన ప్రతిపక్షంగా జగన్‌ తీర్చిదిద్దారు. తొమ్మిదేళ్ల రాజ కీయ ప్రస్థానంలో ఇంత విస్తృతంగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అరుదుగా కనిపిస్తారు. ఆయన ఓదార్పుయాత్ర, రైతు భరోసాయాత్ర, ప్రత్యేక హోదాపై పోరు ఇందుకు నిదర్శనం. 10 కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ బహిరంగ సభలు జరిపిన చరిత్ర ఎవరికీ లేదు. ఆయన జరుపుతున్న ప్రజాసంకల్పయాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ప్రత్యేకహోదా ఆవశ్యకతను జగన్‌ గుర్తించినంతగా వేరే ఏ పార్టీ నాయకులు గుర్తించలేదు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన పార్టీకే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి జగన్‌. అలాగే పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను జగన్‌ ఎండగట్టినంతగా మరెవరూ వెలుగులోకి తేలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అనేక విభజన హామీలు అమలుపరచలేదని కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్న నిఖార్సైన నాయకుడు జగన్‌. రాజధాని నిర్మాణంలో అవి నీతి అక్రమాలను ప్రశ్నించిన నాయకుడు కూడా వైఎస్‌ జగనే. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య సమతుల్యత జరగాలని నినదించిన నాయకుడు జగనే.

నేడు పోరాటాలకే జగన్‌ స్ఫూర్తి. కాంగ్రెస్‌ పార్టీని ఆయన వదిలిన తీరూ, తను, తన తల్లి పార్లమెంట్, అసెంబ్లీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేసి నేడు ఒక బలమైన పార్టీగా ఎదిగి వచ్చిన తీరు రాజకీయ పార్టీలకు ఓ ఆదర్శం. తన పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను బాబు కొనుగోలు చేసి జగన్‌ను దెబ్బతీయాలనుకున్నా ఆయన చలించలేదు. తనపై భౌతి కంగా దాడి జరిగినప్పుడు కూడా ఆయన నిబ్బరంగా వ్యవహరించారు. రాష్ట్రంలో జగన్‌ అంటే జనం.. జనం అంటే జగన్‌.. ఇదే నేడు మనకు కనిపిస్తున్న వాస్తవం. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని రైతులకు ద్రోహం చేయడాన్ని, నిరుద్యోగ యువతను మోసగించడాన్ని, డ్వాక్రా మహిళలకు ద్రోహం చేయడాన్ని ఆయన వందలాది సభలలో బట్టబయలు చేశారు.

వైఎస్సార్‌ తనయుడిగా ఆ మహా నుభావుడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దివిటీని కొనసాగించే ధీశాలిగా జగన్‌ ఎదిగారు. నేడు జగన్‌ నిరంతరం ప్రజల్లో ఉండి రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక వాతావరణం కల్పించగలిగారు. ప్రజలల్లో వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూల వాతావరణ కల్పించారు. నేడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. ఈ భావనతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్‌ సమన్వయకర్తలు పని చేయాలి. రాష్ట్ర ప్రజలు జగన్‌ను ఆశీర్వదించి సీఎంగా ఎన్నుకోవడానికి కృషి చేయాలి. దివంగత నేత వైఎస్‌కు నివాళిగా తనయుడు జగన్‌ను సీఎం చేయడం ద్వారా ఆయనకు శుభాభినందనలు అందించినవారమవుతాం.

వ్యాసకర్త : ఇమామ్‌, కదలిక సంపాదకులు

మొబైల్‌ : 99899 04389

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top