
అవును! ఆయనకి మనమందరం ఓ కుటుంబం. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆయనే ఒక కుటుంబం. కావాలంటే చూస్కోండి.. మన ఇంట్లోనే ప్రతి ఒక్కరిలో వైఎస్సార్ గుణం ఒక్కటైనా కనబడుతుంది. అమ్మలోని త్యాగం.నాన్నలోని నీడ.అన్నయ్యలోని అండ.అక్కయ్యలోని సంస్కారం.చెల్లిలోని ప్రేమ.తమ్ముడిలోని తెగువ.తాతయ్యలోని నవ్వు.అవ్వలోని ఆపేక్ష. ఇలా కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ, మంచి స్నేహితుల్లోనూ మనకి వైఎస్సార్ కనబడుతూనే ఉంటారు. మనలాంటి పెద్ద కుటుంబాన్ని ఒక్కటిగా కలబోస్తే ఆయనే మన వైఎస్సార్. ప్రతి గుండె పురుడుపోసుకున్న నమ్మకమే వైఎస్సార్.మనల్ని మనం ఆయనలో చూస్కోగలం.ఆయనలో మన జీవనస్ఫూర్తిని వెతుక్కోగలం. ఈ మాటలు వైఎస్ విజయమ్మ తరచూ చెబుతూ ఉంటారు.వారితో పంచుకున్న జీవితంలోని కొన్ని అనుభవాలు ఆమె మాటల్లోనే...
రాష్ట్రమంతా ఇలాగే ఉండాలి కదా!
ఈయన మొదటినుంచీ హైలీ ప్రాక్టికల్ మనిషి అనీ, లక్ష్యసాధన దిశగా పనిచేసే తత్వం ఆరోజు నుంచే ఉండేదనీ ఈయన స్నేహితులు చెప్తూంటారు. అంతేకాదు, ఈయనకు రాజకీయాల మీద ఆసక్తే కాదు, మంచి అవగాహన కూడా ఉండేదనీ, రాష్ట్ర – జాతీయస్థాయి రాజకీయాల గురించి తమతో కూలంకషంగా చర్చించేవారనీ, భవిష్యత్తులో మంచి నాయకుడు అవ్వాలనే ఆశయం కూడా తనకు మొదటినుంచీ ఉండేదనీ వాళ్లంటూంటారు.లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఈయన, కృష్ణా జిల్లా పంటలు చూసి, వాళ్లనడిగి వివరాలన్నీ తెలుసుకున్నారట! అంతేకాదు, గోదావరి జిల్లాల్లో పంటలు, నీళ్ళు, పచ్చదనం చూసినప్పుడు కూడా ఈయన ‘రాష్ట్రమంతా ఇలానే పచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది’ అని అనుకున్నారట! ఆ విషయాలను గుర్తుచేసుకుంటూ ఈయన స్నేహితులు – ‘ఆ వయసులోనే రాజుకి అలాంటి ఆలోచనలు ఉండటం మాకిప్పటికీ ఊహకందని విషయం’ అని అంటుంటారు.
రాఖీ అన్నయ్య
ఆడవాళ్లను ఎవరైనా ఏడిపించినా, ఇబ్బంది పెట్టినా ఈయన అస్సలు సహించేవారు కాదు. అంతేకాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మగవాళ్ళదేనని ఫీలయ్యేవారు. ఓసారి సుగుణక్క (వైఎస్ ఫస్ట్ కజిన్) స్నేహితురాలిని ఒక కుర్రాడు ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. దానికి ఆ అమ్మాయి తిరస్కరించినా, వదలకుండా ఆమెని వెంటబడి వేధించాడు. ఆ విషయం ఆ అమ్మాయి ఈయనకు చెప్పగానే, కాలేజీలో అందరిముందరా అతన్ని దండించారు. అంతే, ఆరోజు నుంచి కాలేజీలో ఎవరూ, ఏ అమ్మాయినీ కామెంట్ చేయడం గానీ, వెంబడించడం గానీ చేయలేదు! అందుకే ఆడపిల్లలందరూ ఈయనని గౌరవభావంతో చూసేవారు. రాఖీ పండుగ వస్తే సుగుణక్కతో పాటు వాళ్లు కూడా ఈయనకు రాఖీలు కట్టేవారు!
కాలేజీ వాతావరణం మారిపోయింది
1963లో గుల్బర్గా ఎం.ఆర్. మెడికల్ కాలేజీని స్థాపించాక ఈయనది మూడో బ్యాచ్! అప్పట్లో ఆ కాలేజీలో కర్ణాటక – నాన్ కర్ణాటక ఫీలింగ్ బాగా ఉండేది! కాలేజీలో చేరగానే ఈయన క్లాస్ రిప్రజెంటేటివ్గా ఎన్నికయ్యారు. రెండో సంవత్సరంలో కాలేజ్ యూనియన్ సెక్రటరీగా కూడా పోటీ చేశారు. ఈయన కాలేజీ సెక్రటరీ అయిన తర్వాత కాలేజీ వాతావరణమే మారిపోయింది! మంచి వక్త అవడంతోపాటు, స్థానిక భాష కన్నడ మీద కూడా ఈయనకు మంచి పట్టు ఉండటంతో, విద్యార్థులను బాగా ఆకట్టుకునేవారు. అందరినీ కలుపుకొనిపోతూ, రాజీలు చేయడంతో, అప్పటివరకు వున్న కర్ణాటక – నాన్ కర్ణాటక ఫీలింగ్ బాగా తగ్గింది. కొన్నాళ్టికి ఈయన కాలేజీలో బాగా పాపులర్ అయ్యారు. మూడవ సంవత్సరంలో ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు! ప్రత్యర్థులు అనుకుని పోరాడినప్పుడు ఎంతటి నిష్ఠతో పోరాడతారో, ప్రత్యర్థుల్ని స్నేహితులుగా మార్చుకోవడంలో కూడా అంతటి నిష్ఠనీ, నిజాయితీని చూపిస్తారని స్నేహితులు చెబుతుంటారు.
గురువు పేరు మీద స్కూలు
ఈయన 7వ తరగతి వరకు పులివెందులలో చదువుకున్నాక, బళ్లారిలోని సెయింట్ జాన్స్ మిషనరీ హైస్కూల్లో 8వ తరగతిలో చేరారు. అక్కడే జార్జిబావ, వివేకం అన్న కూడా చేరారు. వీళ్లను చూసుకోవడం కోసం మామ, తన స్నేహితుడు వెంకటప్ప మాస్టారుని, ఆయన భార్య కొండమ్మని, పులివెందుల నుంచి బళ్లారి పంపించారు. పిల్లలు లేకపోవడంతో వాళ్లు కూడా వీళ్లని సొంత బిడ్డల్లా చూసుకున్నారనీ, అసలు వెంకటప్ప మాస్టారి మూలంగానే ఈయనకి క్రమశిక్షణ, నిబద్ధత, సోషలిస్టు భావాలు చిన్నతనంలోనే అలవడ్డాయనీ, పుస్తకాలు చదివే అలవాటు కూడా ఆయన వల్లే మొదలైందనీ చెప్తుంటారు. అలా ఆయన దగ్గర నుంచి ఈయన కేవలం చదువే కాదు, జీవితంలో ఉపయోగపడే ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆ విశ్వాసం, కృతజ్ఞతతోపాటు బీదవాళ్లకు ఉచిత విద్యనందించాలన్న సంకల్పంతో వెంకటప్ప మాస్టారు పేరుమీద పులివెందులలో ఈయన ఒక స్కూలు కట్టించారు. బాగా గుర్తు... మొదట్లో ఆ పేరు వినగానే చాలామంది – ‘ఇదేం పేరు? ఎవరిది?’ అని అడిగేవారు. దానికీయన – ‘అది మా గురువుగారి పేరు’ అని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.
కొడుకు పుట్టినా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ
హౌస్సర్జన్సీ తర్వాత అనుభవం కోసం ఈయన జమ్మలమడుగులోని క్యాంప్బెల్ హాస్పిటల్లో చేరదామనుకున్న టైమ్లోనే నేను కూడా డెలివరీ కోసం అదే హాస్పిటల్లో చేరాను. ఈయన హౌస్సర్జన్సీ 1972, డిసెంబర్ 20న పూర్తయింది, జగన్ 21న పుట్టాడు. కొడుకు పుట్టాడని తెలియగానే ఈయన, సుగుణక్క, మరికొంతమందితో కలిసి జీపులో తిరుపతి నుంచి జమ్మలమడుగు వచ్చారు. తండ్రి అయ్యారన్న ఆనందంలో ఈయన దారిపొడవునా ఈలలేసుకుంటూ, పాటలు పాడుకుంటూ వచ్చారట!హాస్పిటల్ గదిలోకి వచ్చిన ఈయన ముందు నన్నే పలకరించారు. ‘ఎలా వున్నావు విజయా? నీరసంగా ఉందా?’ అని నా చేయి పట్టుకుని అడిగారు. ఆ తర్వాతే జగన్బాబును ఎత్తుకుని నా పక్కన మంచంమీదే కూర్చున్నారు. తను తండ్రి అయ్యాడన్న సంతోషంకన్నా, తన భార్య ఆరోగ్యం గురించి తనకున్న ఆలోచన నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఇలాంటి చిన్నచిన్న విషయాలు గుర్తుచేసుకున్నప్పుడల్లా అనిపిస్తూంటుంది – ఒక నాయకుడు తన సంతోషాన్ని మించిన బాధ్యతను తెలిసినవాడయితేనే గొప్ప నాయకుడవుతాడు.
చేతినిండా పనుంటే ఫ్యాక్షన్ మరకలుండవు!
రాయలసీమలో మొదటినుంచీ ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువేగానీ, ఈయన మాత్రం ఎప్పుడూ దానికి వ్యతిరేకమే. ఫ్యాక్షన్ మంచిది కాదనీ, అది తరతరాలని నాశనం చేస్తుందనీ గట్టిగా నమ్మేవారు. ఈయనైతే ఫ్యాక్షన్ చేకూర్చే చేటు గురించి నిత్యం వాళ్లకు హితబోధ చేసేవారు... ‘ఈ ఫ్యాక్షన్లు పెట్టుకుని ఏం సాధిద్దామని? అవతలి వాళ్లను మనమేదైనా చేస్తే, వాళ్ళెందుకు ఊరుకుంటారు... మనల్నీ అదే చేస్తారుగా! దానివల్ల మన పిల్లలకూ, పెద్దవాళ్లకూ ద్రోహం చేసినవాళ్లమవుతాం. అదే మనం మంచి చేస్తే... మనకూ, మన పిల్లలకూ అందరికీ మంచి జరుగుతుంది’ అని!ఈయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో... రాయలసీమలో, ముఖ్యంగా కడపలో చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. అప్పుడీయన గొడవలున్న ప్రతి గ్రామానికి వెళ్లి, ఇరువైపుల వాళ్లకు రాజీ చేయడానికి ప్రయత్నించి, చాలావరకు సఫలీకృతులయ్యారు. ఆ ప్రయత్నంలో సొంత డబ్బు సైతం లెక్క చేయకుండా ఖర్చుపెట్టేవారు. ఈయన ఆధ్వర్యంలో పులివెందుల తాలూకాలో చాలావరకు పంచాయితీలు ఈయన మాట మీద పరిష్కరించబడేవి. పంచాయితీలన్నీ ఎక్కువశాతం ఇంట్లోనే జరిగేవి. జనాలందరూ వెళ్లేసరికి ఒక్కోసారి రాత్రి ఒంటిగంట, రెండు కూడా అయ్యేది. ఆ ఓర్పు, ప్రేమ, దయాగుణం, సహాయం చేసే స్వభావం చూసే జనాలు ఈయన మాటను గౌరవించేవారు.అసలు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలంటే అక్కడ కూడా కోస్తా మాదిరిగా రెండు పంటలు వేసే నీటి వనరులు, పరిస్థితులు కల్పించాలనీ, అప్పుడే అక్కడి ప్రజలకు గొడవల గురించి ఆలోచించే టైమ్ ఉండదనీ, ఆ దిశగా కృషిచేయాలనీ ఈయన నిత్యం తాపత్రయపడేవారు. ఫ్యాక్షనిజం అనేది మంచిది కాదని ఒక నినాదంలా చెప్పి, దాన్ని రూపుమాపడానికి అంత కృషిచేసినా... ఈయన మూలంగా పులివెందులలో, కడపలో దాదాపు అంతమైనా... కొందరు కావాలని ఈయన మీద ‘ఫ్యాక్షనిస్టు’ అని ముద్రవేశారు! దానికి మొదట్లో ఈయన బాధపడ్డా, తర్వాత్తర్వాత పట్టించుకోవడమే మానేశారు!
అమ్మకే అమ్మ
ఈయనకు అమ్మంటే ప్రాణం. అమ్మకి చాలా పద్ధతిగా, వారానికి ఒక ఉత్తరం రాసేవారు. 1990 ప్రాంతంలో అత్తమ్మకి తలకి దెబ్బతగిలి బ్రెయిన్ హేమరేజ్ అవడంతో ఢిల్లీకి తీసుకువెళ్లాం. అక్కడ ఆవిడ్ని 25 రోజులు హాస్పిటల్లో ఉంచారు. ఆ 25 రోజులపాటు ఈయన రాజకీయాలు, మిగతా పనులన్నీ మానుకుని, ఒక్కపూట కూడా బయటికి పోకుండా, ఆవిడ వెన్నంటే వుండి జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ టైంలో ఆవిడ ఎవ్వరినీ గుర్తుపట్టేవారు కాదు... అందుకని ఈయన మాటిమాటికీ ఆవిడ్ని పలకరించడం, నవ్వించడం, జనాలను గుర్తుపట్టేలా చేయడం, వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని తిప్పడం... లాంటివన్నీ ఎంతో ఓపిగ్గా చేశారు. అంత బిజీ టైంలో కూడా ఈయన పనులన్నీ పక్కనపెట్టేసి, ఆవిడ్ని అలా చిన్నపిల్లలా జాగ్రత్తగా చూసుకోవడం నాకే ఆశ్చర్యమేసింది!
రియల్ వాల్యూ ఆఫ్ ఎ ఫాదర్!
జగన్ను ఆయన ప్రేమగా సన్నీ అని పిలుచుకునేవారు. ఈయనకు ఎవరైనా ఏ సలహా ఇచ్చినా శ్రద్ధగా దాని గురించి ఆలోచించేవారు. అదే జగన్కు కూడా చెప్పేవారు. ‘సన్నీ, ఒక్క విషయం గుర్తుంచుకో – ఈ ప్రపంచంలో నీ దగ్గరి నుంచి ఏం ఆశించకుండా, నీ బాగుకోసమే తాపత్రయపడే వ్యక్తి ఎవరైనా ఉంటే, అతడి కంటే నీకు మంచి స్నేహితుడు ఇంకొకరు ఉండరు. వచ్చిన సలహా కంటే కూడా చెప్పిన వ్యక్తి ఎవరో గుర్తించు’ అని!వాళ్ల నాన్న ప్రభావం వల్ల, జగన్ చాలా పద్ధతిగా తయారయ్యాడు. యువకుడిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజూ పార్టీలకు, పబ్లకు వెళ్లడం గానీ, సిగరెట్లు, మందు ఇతరత్రా చెడు అలవాట్లను గానీ దరిదాపులకు రానీయలేదు. అవన్నీ తల్చుకుంటూ జగన్ అంటూ ఉంటాడు – ‘దట్ వజ్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఎ ఫాదర్’ అని!
నాన్న మాటే జగన్ బాట
జగన్కి ప్రజల మ«ధ్య ఉంటూ వాళ్లకు సేవ చేయాలని, అందరి మన్ననలు పొందాలని బాగా ఉండేది. అది నిశితంగా గమనించిన ఈయన, ఇక తన ఇష్టాన్ని కాదనలేక మెల్లమెల్లగా ఆ దిశగానే ప్రోత్సహించడం మొదలెట్టారు. అంతేకాదు, అప్పటినుంచి జగన్తో రాజకీయాల గురించి, నిబద్ధత గురించి, క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడి తగ్గట్టుగా మలిచారు. ‘రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం, నిబ్బరం కలిగి ఉండాలి. అన్నీ పోగొట్టుకున్నా మాటిచ్చినదానికి నిలబడగలగాలి. మనల్ని నమ్ముకున్న వాళ్లకి తోడుగా ఉండగలగాలి... అప్పుడే నీకు వాళ్లు తోడుగా వుంటారు’ అని; ‘మనతో కష్టాలు పంచుకోవాలి అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అందుకే ఎవర్నీ అశ్రద్ధ చేయవద్దు... అందర్నీ పలకరించాలి...’ లాంటివి చాలాసార్లు చెప్పడం విన్నాను!ఆ ప్రభావం వల్లేనేమో జగన్ ఎప్పుడూ అంటూండేవాడు – ‘నాన్న అన్నట్టుగా, ఎన్నాళ్లు బతికామన్నది కాదమ్మా ఎలా బతికామన్నది ముఖ్యం! చూడమ్మా, నాన్నని ఎంతమంది ఆరాధిస్తున్నారో! నాక్కూడా ఆయనలా మంచిపనులు చేస్తూ, ప్రజల మనసుల్లో ఉండాలని ఉంది’ అని! నమ్ముతారో లేదో, ఈ మాటలు చెప్పినప్పుడు జగన్కు గట్టిగా 18 ఏళ్లు కూడా లేవు! అందుకే, వాళ్ల నాన్న పోయిన తర్వాత తను మళ్లీ అవే మాటలు చెప్తున్నాడన్నా, ఇంత పట్టుదలతో ముందుకెళ్తున్నాడన్నా నాకేమాత్రం ఆశ్చర్యం కలగట్లేదు!
జెండాకు దీక్షే ఊపిరి
1983 ఎన్నికలు... ఎన్.టి. రామారావు ప్రభంజనంలో ఎంతోమంది పెద్దపెద్ద కాంగ్రెస్ నాయకులు అపజయం పాలైన సమయంలో కూడా ఈయన, పులివెందుల నుంచి అవలీలగా గెలిచారు.
ఆ సంవత్సరంలోనే ఓసారి ఈయన రాజీవ్గాంధితో పాటు ఢిల్లీ వెళ్లారు. ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈయన రాజీవ్గాంధీతో ఆంధ్ర రాజకీయాల గురించి కూలంకషంగా చర్చించారు. ఆయనతో అంత నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడిన తొలి వ్యక్తి ఈయనే! రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో... పదేపదే ముఖ్యమంత్రుల్ని మార్చడం వల్ల వచ్చిన నష్టం ఏమిటో... కాంగ్రెస్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలేమిటో, పార్టీని బలోపేతం చెయ్యాలంటే ఏం చెయ్యాలో... అందుకు తగ్గ వ్యూహాలేమిటో, ఎన్టీఆర్ని ఎదుర్కొనలేకపోవడానికి కారణాలేమిటో... రాజీవ్కి స్పష్టంగా వివరించారు. ఆ సమయంలోనే ఈయన, వెనుకబడిన కులాలకు చెందిన కె.ఇ. కృష్ణమూర్తిని పీసీసీ ప్రెసిడెంట్గా నియమిస్తే బాగుంటుందని కూడా సూచించారు. అయితే, ఆంధ్ర రాజకీయాల మీద ఈయనకున్న అవగాహన, ఈయన మాట్లాడిన తీరు చూసి ఆయన బాగా ప్రభావితం అయ్యారనుకుంటా... వారం రోజుల తర్వాత ఈయన్ని ఢిల్లీకి పిలిపించి, తననే పీసీసీ ప్రెసిడెంట్గా ఉండమని అడిగారు.ఎన్టీఆర్ ప్రభంజనానికి అతలాకుతలమైన కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేసే సత్తా ఉన్నవాళ్లు పూర్తిగా అరుదైపోయారు. ఘోరపరాజయం చవిచూసిన పార్టీలో నిరాశే తప్ప ఎక్కడా ఉత్సాహం కనబడలేదు. మళ్లీ కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఉత్తేజాన్ని నింపాలంటే, ఎన్టీ రామారావు చరిష్మాను ఎదుర్కొనే నాయకుడి అవసరం ఎంతగానో ఉండింది. ఈ బాధ్యతని బరువు అనుకోకుండా, అవకాశం అనుకుని ఈయన కాంగ్రెస్కి పునరుజ్జీవం పోయడానికి శాయశక్తులా కృషిచేశారు. పడిపోతున్న జెండా పడకుండా ఎగరడానికి మనస్థైర్యం అన్న ఊపిరిని నింపాల్సిన అవసరం ఉంది. అలాంటి దీక్షతో ఆగస్టు 10, 1983న 34 ఏళ్ల అతి చిన్న వయసులో ఈయన మొదటిసారి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు.
పదవి రానప్పుడు నవ్వు వచ్చింది
1991... అప్పటివరకు అధికారంలో ఉన్న నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ మెజారిటీ కోల్పోవడంతో, కేంద్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ఈయన కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈసారి దాదాపు 4.5 లక్షల భారీ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి సి.రామచంద్రయ్యపై విజయం సాధించారు. అది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మెజార్టీ. అసలు ఈయనే స్వయంగా నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసుకుంది... మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మాత్రమే! ఆ తర్వాత ఎప్పుడూ తిరగలేదు! ఇంట్లో వాళ్లందరికీ తలా ఒక మండలం అప్పజెప్పి, తను జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు, ఇతర జిల్లాలకు తిరిగి ప్రచారం చేసేవారు. ఈయన ఎప్పుడూ ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదు. ఎన్నిసార్లు ప్రజల దగ్గర గెలిచినా, పార్టీ పదవుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక ఇరకాటం సృష్టించేవారు. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఒకసారి, సీడబ్ల్యూసీ సభ్యుడిగా మరోసారి ఈయన పేరును ప్రతిపాదించినా, ఎవరో ఒకరు కుట్రచేసి అడ్డుకునేవారు. ఈయనకు అవేవీ పట్టేవి కాదు. వాళ్ల అగచాట్లు చూసి ఈయన నవ్వుకునేవారు. ‘అదేంటి? పదవి రాకపోతే ఎవరైనా బాధపడతారు కానీ, మీరు ఇలా నవ్వుకుంటారేంటి?’ అని అడిగితే, ‘పదవికోసం నేను అగచాట్లు పడితే బాగుండు... అది నేనెలాగూ చేయను. కానీ, నాకు పదవి రాకుండా వీళ్లు చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తుంటే నాకు నవ్వాగదు’ అనేవారు.
తండ్రీకొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా...
ఆరోజుల్లో చాలావరకు పిల్లలకు తండ్రి అంటే బాగా భయముండేది. మామ డిసిప్లీన్ విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండేవారు. ఇంట్లో ఉన్నవాళ్లందరికీ ఆయనంటే కొంచెం భయంగానే ఉండేది. కానీ ఈయనకు మాత్రం మామ అంటే అస్సలు భయం ఉండేది కాదు. పిల్లలు తప్పు చేస్తారేమోనని మామ దండించేవారు కాని, నిజానికి ఆయన మనస్సు చాలా మృదువైంది. నాకు బాగా గుర్తు... మా ఇంటికి ఒకసారి చాలామంది డాక్టర్లు భోజనానికి వచ్చారు. వాళ్లంతా మామ పెట్టించిన క్యాంపులో పేషంట్లను పరీక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంట్లో పనివాళ్లు ఎంతమంది ఉన్నా, మామ స్వయంగా అందరికీ అన్ని సపర్యలు చేశారు. భోజనం అయ్యాక వాళ్లు చేతులు కడుక్కుంటుంటే, వాళ్లకు టవల్ కూడా అందించారు. ఇది మామ గుణం. తన ఊరి ప్రజలకు ఎవరైనా మేలు కోరితే, వారికి సేవ చేయడం ఒక గొప్ప అదృష్టంగా భావించేవారు. ఇలాంటివి ఈయనకు చాలా నచ్చేవి. వాళ్ల నాన్నను చూసి ఈయన కూడా అతిథులను చాలా ఆప్యాయతతో చూసుకునేవారు. అలా ఇంట్లో ఉన్న సంస్కారమే సమాజం పట్ల కూడా చూపించడం మొదలుపెట్టారు. నాతో ఎన్నోసార్లు మామను తలచుకుంటూ ఈయన ఎంతో గొప్పగా ఫీలయ్యేవారు. చిన్నప్పుడంతా ఈయన తండ్రిని చూసి మంచి విషయాలు నేర్చుకుంటే, పెద్దయ్యాక ఈయనను చూసి మామ క్షమాగుణం, దయాగుణం నేర్చుకున్నారు. మామ చనిపోయిన తర్వాత ఈయన ఆ స్నేహాన్ని, ప్రేమను, అనుభూతిని జగన్లో పొందారు.ఈయనకి మామతో మొదటినుంచీ అటాచ్మెంట్ ఎక్కువ. ఇద్దరూ తండ్రీకొడుకులుగా కన్నా స్నేహితులుగా ఎక్కువ మెలిగేవారు. కుటుంబ బాధ్యతలు, బిజినెస్ విషయాలు, రాజకీయాల గురించి మామ ఎక్కువగా ఈయనతోనే చర్చించేవారు. ఈయన కూడా ఆ పనులన్నీ చాలా బాధ్యతగా నెరవేర్చేవారు.
షర్మిల అంటే ప్రేమ!
ఈయన షర్మి పట్ల చూపించే ప్రేమ చాలా అసాధారణంగా అనిపించేది. తను వచ్చిందంటే చాలు ఈయనలో తెలియని ఆనందం కనబడేది. చిన్నతనంలో ఈయన షర్మితో లెక్కపెట్టి మరీ వంద ముద్దులు పెట్టించుకుంటే, పెద్దయ్యాక ఈయనే షర్మికి ముద్దు పెట్టడం మొదలెట్టారు. ఎప్పుడైనా పొరపాటున షర్మి మరచిపోయినా, ఈయనే ‘హాయ్ పాప్స్’ అని దగ్గరికెళ్లి, తన భుజాలు పట్టుకుని మరీ ముద్దు పెట్టేవారు.
ఈ తండ్రీకూతుళ్ల ప్రేమను చూసి షర్మి ఫ్రెండ్స్ తరచూ అనేవారు – ‘నిన్నూ, మీ నాన్నను చూస్తే మాకు అసూయగా అనిపిస్తుంది. మా నాన్న కూడా మమ్మల్ని బాగా ముద్దు చేస్తారు కానీ, ఇంత కాదు’ అని!అంత ప్రేమ ఈయనకు ఆడపిల్ల అంటే... అంత ఆనందం ఈయనకు షర్మి పక్కనుంటే! ‘నాన్న నన్ను ప్రేమించిన తీరులో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఆయన నాపై చూపించిన ప్రేమ, కురిపించిన ముద్దులు రోజూ మిస్సవుతున్నాను. దేరీజ్ నో లైఫ్ ఎనీ మోర్ ఇన్ మై లైఫ్... నా జీవితంలో ఇక జీవం లేదు’ అని షర్మి బాధపడుతుంటుంది.
దేవుడు కష్టమిచ్చేదే బలపడటానికి
1996 లోక్సభ ఎన్నికలు... విపక్షమూ ఒక మీడియాహౌజ్ కలిసి ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలని గట్టిగా ప్రయత్నించడం... అదే సమయంలో స్వపక్షంలో వాళ్లే కొందరు ఏకమై ఈయనకు వ్యతిరేకంగా పనిచేయడం... రెండూ తోడై అప్పటిదాకా ఇరవయ్యేళ్ల రాజకీయ ప్రస్థానంలో, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా విజయభేరి మోగించిన ఈయనకు... మొదటిసారి అతితక్కువ మెజారిటీ వచ్చింది! దానికితోడు, పోలీసు యంత్రాంగమంతా పూర్తిగా రాజకీయంగా మారడం... బూత్ దగ్గర ఉన్న మనుషులను ఆడ–మగ తేడా లేకుండా కొట్టి, వాళ్లను భయభ్రాంతులకు గురి చేసి, ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం, సరిగ్గా ఎన్నికల సమయంలో ఈయన మద్దతుదారులందర్నీ ఉన్నట్టుండి అరెస్ట్ చేయడం... గట్టిగా 23 ఏళ్లు కూడా లేని జగన్ను, మామను, మరికొందరు కుటుంబ సభ్యులను గృహనిర్బంధం కూడా చేయడంతో, ఆ ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది! ఏదెలా ఉన్నా, కనీసం 50 వేల మెజారిటీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు ఈయన! కానీ కౌంటింగ్ జరుగుతున్నకొద్దీ అందరిలోనూ గెలుస్తామన్న ఆశ సన్నగిల్లడం మొదలెట్టింది. ఒక స్టేజిలో ఓడిపోతామేమోనన్న భయం కూడా వేసింది! కానీ, ఎన్ని శక్తులు ఏకమైనా, దేవుడి ఆశీస్సులూ ప్రజల దీవెనలూ మాకు తోడుగా ఉండి, విజయాన్ని చేకూర్చాయి. విజయం లభించింది కానీ ఆ విజయం ఈయనకు సంతృప్తిని మిగల్చలేదు. కేవలం 5,445 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది.ఆ సమయంలో ఫ్యామిలీలో ఎవ్వరం భోజనాలు కూడా చేయకుండా, ప్రార్థనలు చేస్తూ కూర్చున్నాం. బాగా గుర్తు... ఎప్పుడూ ఫాస్టింగ్లకు దూరంగా ఉండే షర్మి, ఆసారి పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ప్రార్థనలు చేసింది! జగన్ కూడా... ఎక్కడ వాళ్ల నాన్న ఓడిపోతారోనని, గెలిస్తే తనకి ఇష్టమైన చికెన్ తినడం మానేస్తానని మొక్కుకున్నాడు! ఈయన పట్టుదలే జగన్కి వుంది. అనుకున్నట్టే, ఈరోజుకూ జగన్ చికెన్ ముట్టుకోలేదు!
ప్రజల గుండెల్లోనే సింహాసనం
రోజూ ఈయన క్రమం తప్పకుండా తనను కలవడానికొచ్చిన సామాన్య ప్రజలందరినీ కలిసి, వారి అర్జీలను స్వీకరించేవారు. క్యాంప్ ఆఫీసు బంగళాలో ఎంత గొప్పవాళ్లు ఎదురుచూస్తున్నా ఈయన ముందు సామాన్యులను పలకరించేవారు. ఎప్పుడో ఓసారి షర్మి ఈయనతో ‘నువ్వు ప్రజలతో ఉంటే, చాలా సంతోషంగా అనిపిస్తావు పా’ అంటే, ఈయన ‘అవును పాపా, నిజమే! ఎందుకంటే బయట వందల మందిని కలవడానికి... లోపల కొంతమందిని కలవడానికి చాలా తేడా ఉంటుంది. బయట కలిసేవాళ్లంతా సమస్యలకోసం వస్తే... లోపల కలిసే వాళ్లంతా సొంత పనుల కోసం వస్తారు... అదీ తేడా’ అని! పదవి వచ్చాక మనిషి ప్రజలకు దూరమైపోతారంటారు. కానీ ఈయన పదవి వచ్చాకే, ప్రజలకు దగ్గరయ్యారు... చాలా దగ్గరివారయ్యారు!
చొక్కా రంగు ఏదైనా గుండెలు పేదవాళ్లవే కదా!
ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా, అన్ని పార్టీల నాయకులూ ఈయనకి సిఫార్సులు పంపేవారు. పెద్ద విషయమేంటంటే, ఎక్కువ తిప్పలు పెట్టిన నాయకులే ఈయన చేత ఎక్కువ సాయం చేయించుకునేవారు. అది తెలిసి కూడా ఈయన కాంగ్రెస్ నాయకులతో సమానంగా ఇతర పార్టీ నాయకులకు అవకాశం ఇచ్చేవారు. దానితో సొంత పార్టీ నాయకులకు కోపం వచ్చి – ‘మీరు వాళ్లకు ఇలా పనులు చేస్తారు, మాట్లాడతారు... వాళ్లు అలా నేరుగా కిందకు వెళ్లి, మైకులు తీసుకుని, మిమ్మల్నే విమర్శిస్తారు. అసలు వాళ్లకి పనిచేసిపెడితే విలువ తెలియట్లేదు సార్’ అనేవారు. దానికీయన ‘పోనీలే... చేయడం మన ధర్మం. అలా మాట్లాడటం, వాళ్ల సంస్కారం! అయినా, నేను సాయం చేసేది ఆ వ్యక్తులకు కాదు... వాళ్లు సిఫార్సు చేసే పేద కుటుంబాలకి! వీళ్ల మీద కోపంతో వాళ్లకి సాయం చేయకపోవడం తప్పవుతుంది’ అనేవారు. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఈయనకు అంతటి కన్సర్న్!
చెవులున్న మనసు
అన్నిచోట్లా పద్ధతిగా టైమ్ పాటించే ఈయన, కొన్నికొన్నిచోట్లకి వెళ్లినప్పుడు మాత్రం అక్కడ నుంచి కదలడం ఇష్టపడేవారు కాదు! ముఖ్యంగా మూగ–చెవిటి పిల్లలు, బీద విద్యార్థులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్న టైమ్ కంటే ఎక్కువ సమయం వాళ్లతో గడిపేవారు.
గోడు ఉండకూడదు, గూడు ఉండాలి
ప్రతి పథకం శాచ్యురేషన్కి రావాలంటూ, ‘‘నేను ఏదైనా గ్రామానికి పోయినప్పుడు ధైర్యంగా మైకు పట్టుకుని ‘ఈ గ్రామంలో ఇల్లు లేనివాళ్లు, నిజంగానే అర్హులై ఉండీ పెన్షన్ రానివాళ్లు, అర్హులైన వాళ్లలో ఏ ఒక్కరికైనా తెల్లకార్డు్డ లేనివాళ్లు ఎవరైనా ఉంటే చేతులెత్తండి’ అని అడగాలి. అలా అడిగినప్పుడు ఒక్క చెయ్యి కూడా లేవకూడదు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలి’’ అని అనేవారు. ప్రతిఒక్కరికీ అన్నీ ఉండాలి, అన్నీ చెందాలని తపించారు.
ఇక్కడ చాడీలు చెప్పరాదు!
ఈయనకు చాడీలు వినడం ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా చెప్తుంటే వెంటనే టాపిక్ మార్చేసేవారు. కానీ అవతలివాళ్లింకా చెప్తూనే ఉంటే ‘పద పద, నీ పని చూసుకోరాదా? అనవసరంగా వాళ్ల గురించి నీకెందుకు?’ అనేవారు. ఎవరిమీదైనా తనదైన అభిప్రాయాన్నే ఉంచుకునేవారు!