పూజలు, వ్రతాలలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు? | Traditional science | Sakshi
Sakshi News home page

పూజలు, వ్రతాలలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?

May 27 2018 1:08 AM | Updated on May 27 2018 1:08 AM

Traditional science - Sakshi

ఉల్లి చేసిన మేలు తల్లయినా చేయదని సామెత. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేని సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలన్న నిబంధన ఉంటుంది. పూజలు, వ్రతాలలోనే కాదు, ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది వెల్లుల్లి, ఉల్లి తదితర మసాలా పదార్థాలను తీసుకోరు. అసలు ఈ విధమైన సంప్రదాయం ఎందుకు వచ్చింది? పూర్వులు ప్రత్యేక సందర్భాలు, పర్వదినాలలో వీటిని తమ ఆహారంలో ఎందుకని నిషేధించారో తెలుసుకుందాం!

ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే సాత్వికం, రాజసికం, తామసికం. వీటిలో ఒక్కో  పదార్థం మనిషిలోని ఒక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి. మాంసాహారం, మసాలా దినుసులు ఇంకా కొన్ని మొక్కలు రాజసిక తత్వానికి చెందినవి. వీటిని తీసుకోవడం వలన కోపం, ఆలోచనలలో అస్థిరత, ఏకాగ్రతలోపం కలుగుతాయట.

ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్టతో ఉండాలనుకునే వారి మనసును మళ్లిస్తాయట. అందుకే ప్రత్యేక సందర్భాలలో ముఖ్యంగా ఎక్కువసేపు ఏకాగ్రతగా కూర్చుని చేయవలసిన పూజలు, వ్రతాలలో ఆహారంలో వాటిని నిషేధించారట. మరో విషయం ఏమిటంటే, ఉల్లి, వెల్లుల్లి వేర్లుగా భూ అంతర్భాగం నుండి లభిస్తాయి. వాటిని శుభ్రం చేసే సమయంలో ఆ సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని వాటిని తినడానికే దూరంగా ఉంటారట.

ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు అవి పెరిగే ప్రదేశం శుచీశుభ్రత లేకుండా ఉంటాయని వాటికి దూరంగా ఉంటారట, భగవంతుణ్ణి భక్తితో కొలిచేటప్పుడు ఇలాంటివి సేకరించడం, వాటిని ఆహారంలో తీసుకోవడం తప్పుగా భావిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement