
కాఫీ.. ఓ ‘విష’మ ప్రయోగం..
పద్దెనిమిదో శతాబ్దిలో స్వీడన్ను పరిపాలించిన వెర్రి మారాజు మూడో గుస్తావ్ కాఫీ విషపూరితమైన పదార్థమా.....
పద్దెనిమిదో శతాబ్దిలో స్వీడన్ను పరిపాలించిన వెర్రి మారాజు మూడో గుస్తావ్ కాఫీ విషపూరితమైన పదార్థమా, కాదా తేల్చుకోవాలనుకున్నాడు. రాజు తలచుకున్నదే తడవుగా ఆస్థాన వైద్యులు వెంటనే ప్రయోగానికి సిద్ధపడ్డారు. అనుమానాస్పద పదార్థాల దుష్ఫలితాలను కనుగొనేందుకు జరిపే ప్రయోగాల కోసం ఇప్పుడైతే గినీ పందులను నమూనాలుగా వాడుతున్నారు గానీ, గుస్తావ్ రాజావారు ఏకంగా ఇద్దరు మనుషులనే ఈ ప్రయోగానికి నమూనాలుగా ఎంపిక చేశాడు. వారిద్దరూ అప్పటికే మరణశిక్ష పడ్డ ఖైదీలు, పైగా కవలలు.
మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తానని గుస్తావ్ రాజావారు భరోసా ఇవ్వడంతో వారిద్దరూ ప్రయోగానికి సిద్ధపడ్డారు. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో వారిద్దరిలో ఒకరికి కాఫీ, మరొకరిటి టీ రోజూ ఇవ్వడం మొదలుపెట్టారు. రోజూ మూడేసి కప్పులు ఇచ్చేవారు. ప్రయోగం ఎటూ తేలకముందే వయసుమళ్లిన ఇద్దరూ వైద్యులూ సహజ మరణం పొందారు. ప్రయోగ ఫలితాలు చూడక ముందే మూడో గుస్తావ్ 1792లో హత్యకు గురయ్యాడు. కవలల్లో టీ తాగిన వ్యక్తి తన 83వ ఏట మరణించాడు. కాఫీ తాగిన వ్యక్తి ఆ తర్వాత కొన్నాళ్లకు కాలం చేశాడు.