గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతా.. | Jaidev forward to Galla TDP in the campaign candidate | Sakshi
Sakshi News home page

గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతా..

Apr 6 2014 1:18 AM | Updated on Sep 27 2018 3:58 PM

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్తుతామని బాలశౌరి చెప్పారు.

 అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్తుతామని బాలశౌరి చెప్పారు. అలాగే మన ప్రాంతానికి  సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌లాంటి హాస్పటల్స్‌తోపాటు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి సంబంధించి గుంటూరు ప్రత్తి పంటకు కేంద్రంగా ఉన్నందున స్పిన్నింగ్‌మిల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో స్పైసస్ బోర్డు శంకుస్థాపన చేశారని దీన్ని పునఃనిర్మాణం చేస్తామన్నారు. అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి.. వ్యాలీ యాడెడ్ చేస్తే రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు.


 జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం..

 ఒక విజన్‌తో ముందుకు వచ్చిన జగన్‌ను ప్రజలు ఆశీర్వదించే సమయం ఆసన్నమైందని బాలశౌరి చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ సీఎం కాగానే గుంటూరులో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిన్నటి వరకు దొంగలు, హంతకులు, అవినీతి పరులు అని ఇప్పుడు టీడీపీలో చేర్చుకొని టిక్కెట్లు ఎలా ఇస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.

 ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందడుగు అంటూ ప్రచారం చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా ముందడుగంటే శోభన్‌బాబు సినిమానే కదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.  అలాగే ఇప్పటికే జిల్లాపరిషత్, మండలపరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసిందని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రాతంశెట్టి రామాంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement