దేవస్థానం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రతపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ, ఆర్అండ్బీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అపరిశుభ్రతపై అమాత్యుడి ఆగ్రహం
Feb 4 2017 11:39 PM | Updated on Aug 30 2019 8:37 PM
- శ్రీశైలం బస్టాండ్ పరిస్థితిపై మండిపడిన సిద్ధా
- స్వామి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
శ్రీశైలం : దేవస్థానం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రతపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ, ఆర్అండ్బీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దర్శనానంతరం ఆయన ఈఓ నారాయణ భరత్ గుప్త, కర్నూలు రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు డీఎం శ్యాంసుందర్తో కలిసి బస్టాండ్ను పరిశీలించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడంతో స్టేషన్ మేనేజర్ ఉస్మాన్ అలీని ప్రశ్నించారు. శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. çభక్తులకు సందర్శనీయ స్థలాలను చూపించే బస్సులు తిప్పడం లేదనే విషయం ఆయన దృష్టికి రావడంతో అధికారులను ఆరా తీశారు. లాభనష్టాలతో ప్రమేయం లేకుండా సైట్సీయింగ్ బస్సులను నడపాలని సూచించారు. అనంతరం ఆయన బస్టాండ్ ప్రాంగణం వెనుక దేవస్థానం వారు చదును చేస్తున్న ఖాళీ ప్రదేశంలో బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు చెప్పారు. అంతకు ముందు ఆయన సతీసమేతంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివార్లకు రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఏఈఓ కృష్ణారెడ్డి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు,లడ్డూప్రసాదాలను అందజేశారు.
Advertisement
Advertisement