ఎవరిదీ ‘పాపం'! | Sakshi
Sakshi News home page

ఎవరిదీ ‘పాపం'!

Published Sun, Jun 26 2016 8:16 AM

ఎవరిదీ ‘పాపం'!

చెత్త కుప్పలో ఏడు నెలల గర్భస్థ శిశువు
మంథన్‌దేవునిపల్లిలో ఘటన

 మాచారెడ్డి : ఎవరి ‘పాప’మో.. ఏమో! కళ్లైనా తెరవని పసిగుడ్డుపై కాఠిన్యం చూపిందో కఠినాత్మురాలు!! కన్నపేగు బంధానికే కళంకం తెచ్చింది. ఏడు నెలల గర్భస్థ శిశువును చెత్తకుప్పలో పడేసింది. మండలంలోని మంథన్‌దేవునిపల్లిలో శనివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. ఏ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డో.. కనికరం లేకుండా కడుపులోనే తుంచేశారు.. మృత శిశువును తీసుకొచ్చి గ్రామానికి చెందిన కామటి భూమయ్య ఇంటి వెనుక చెత్తకుప్పల్లో పడేశారు.

శనివారం అటువైపు వచ్చిన గ్రామస్తులకు శిశువు మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రొబేషనరీ ఎస్సై హరీశ్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బుజ్జి అక్కడకు చేరుకున్నారు. మృత శిశువుకు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామానికి తీసుకొచి, ఖననం చేశారు. అవివాహిత లేక వివాహేతర సంబంధం ఉన్న మహిళే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లిలో మొత్తం 18 మంది గర్భిణులు ఉన్నారని, వారిలో ఎవరూ ప్రసవించలేదని తెలిపారు. ఈ శిశువు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

Advertisement
Advertisement