పాములపాడు మండలం మద్దూరు, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.చంద్రశేఖర్ రావును కోరారు.
కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోండి
Oct 19 2016 12:48 AM | Updated on Sep 4 2017 5:36 PM
– ఎస్ఈని కలిసి విన్నవించిన ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు సిటీ: పాములపాడు మండలం మద్దూరు, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఐజయ్య మంగళవారం జల మండలిలో ఎస్ఈని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాల్వ విస్తరణ కోసం కేసీ కాలువ అక్విడక్ కూల్చి వేశారన్నారు. దీంతో సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందడం లేదన్నారు. ఎస్ఆర్బీసీ కాల్వ నుంచి కాంట్రాక్టర్ రెండు మోటర్లు జనరేటర్ పెట్టి నీటిని ఆయకట్టుకు అందించే వారని, అయితే రెండు రోజుల నుంచి జన రేటర్ తీసేసి ఒక మోటర్ ద్వారానే నీటిని పంపు చేస్తుండడంతో పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉన్నాయని, ఎలాగైనా నీరు ఇచ్చి పంటలకు కాపాడాలని ఎమ్మెల్యే కోరారు. కేసీ కాల్వకు సుంకేసుల నుంచి నీరు బంద్ చేయడంలో పంటలకు నీరు అందక ఎండుతున్నాయని, టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయించాలన్నారు. ఎస్ఈ స్పందించి డ్యామ్ నుంచి 1.55 టీఎంసీలకు ఇండెంట్ పెట్టామని, నీటి విడుదలకు ఈఎన్సీ అనుమతులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో ఫోన్ మాట్లాడి టీబీ డ్యామ్ నుంచి కేసీ ఆయకట్టుకు నీరు విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హంద్రీనీవా నుంచి దామగట్ల చెరువుకు శ్రీశైలం నీటిని నింపితే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు, బొల్లవరం, నాగటూరు చెరువులకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందఽన్నారు. ఎస్ఈ .. చిన్న నీటిపారుదల శాఖ నంద్యాల ఈఈ బాల చంద్రారెడ్డితో ఫోన్లో మాట్లాడి హంద్రీనీవా నీరు దామగట్ల చెరువు నింపేందుకు అవకాశం ఉంటే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Advertisement


