తడిసి ముద్దయిన కోనసీమ
అమలాపురం : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ.. మెట్ట.. కోనసీమ ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షం పడింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం ఎ
జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు
అమలాపురంలో అత్యధికంగా 105.2 మి.మీ. వర్షపాతం
అమలాపురం : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ.. మెట్ట.. కోనసీమ ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షం పడింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లా వ్యాప్తంగా సగటున 35.2 మి.మీ. వర్షం పడింది. అత్యధికంగా అమలాపురంలో 105.2 మి.మీ. వర్షం కురవగా, అత్యల్పంగా కోరుకొండలో 1.2 మి.మీ. వర్షం పడింది. గురువారం రాత్రి నుంచి కోనసీమ తడిసి ముద్దయ్యింది. అమలాపురంతోపాటు అంబాజీపేట, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లిలో భారీ వర్షం కురిసింది. మెట్ట ప్రాంతంలో శంఖవరం మండలంలో 101.2 మి.మీ. వర్షం కురవగా, తుని, తొండంగి, ఏలేశ్వరం, గంగవరం మండలాల్లోను, ఏజెన్సీలోని వై.రామవరం, అడ్డతీగల మండలాల్లో పలు ప్రాంతాల్లో సైతం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఖరీఫ్కు ఊతం
డెల్టాతోపాటు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఖరీఫ్కు ఊతం లభించింది. డెల్టాలో జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా పంట కాలువల ద్వారా సకాలంలో సాగునీరు శివారు ప్రాంతాలకు అందలేదు. దీంతో తూర్పు, మధ్యడెల్టాల్లో బ్యారేజ్కు సమీపంలో ఉన్న కొత్తపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లలో మాత్రమే నారుమడులు ఆశాజనకంగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే నీరందుతుండగా.. ఇదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ ఖరీఫ్ పనులు జోరందుకోనున్నాయి. వర్షాలు లంక ప్రాంతాల్లోని కూరగాయ, ఇతర వాణిజ్య పంటలకు మేలు చేస్తున్నాయి. కొబ్బరి రైతులు వర్షం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఎండల వల్ల పిందెలు రాలి, ఆకులు తలవాల్చాయని, ఈ సమయంలో భారీ వర్షం పడడం, వాతావరణం చల్లబడడంతో కొబ్బరి తోటలకు మేలు జరుగుతుందని రైతులు తెలిపారు.