పర్యావరణ హితంగా పండగ చేసుకుందాం
– కాలుష్య నియంత్రణ మండలి జోనల్ చీఫ్ ఇంజినీర్ పిలుపు
– కరపత్రాలు విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): దీపావళిని పర్యావరణ హితమైన పండుగగా నిర్వహించుకోవాలని కాలుష్యనియంత్రణ మండలి జోనల్ ఎన్విరాన్మెంటల్ చీఫ్ ఇంజినీర్ రాజేంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో పర్యావరణహిత కరపత్రాలను విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బాణసంచా కాల్చవద్దని సూచించారు. ఆందమైన దీపాల వరుసలను ప్రోత్సహిద్దామని వివరించారు. టపాసులకు బదులుగా స్వీట్లు పంచుకుందామన్నారు. టపాసుల్లో చారకోల్, సల్పర్, నైట్రేట్స్ వల్ల విషవాయువులు వెలువడి శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగుతాయని, ధ్వని కాలుష్యంతో పక్షులు చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీపావళిని ప్రమిదల కాంతులతో సుఖ సంతోషాలతో నిర్వహించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. కార్యక్రమంలో పీసీబీ శాస్త్రవేత్త అచ్యుతరామయ్య, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.