
మావోయిస్టుల పేరుతో దందా
మావోయిస్టుల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను జిల్లా
♦ ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు
♦ ఆరుగురు ముఠా సభ్యులను
♦ అదుపులోకి తీసుకున్న పోలీసులు
♦ తహసీల్దార్ ఎదుట బైండోవర్
♦ జిల్లాలో మరికొంత మంది ఉన్నట్లు సమాచారం
తూప్రాన్: మావోయిస్టుల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను జిల్లా ఎస్సీ సుమతి ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకుని స్థానిక తహసీ ల్దార్ నజీబ్ అహ్మద్ ఎదుట బైండోవర్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సీఐ కార్యాలయంలో శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూప్రాన్ పట్టణానికి చెందిన మక్బుల్ (నకిలీ మావోయిస్టు)తో మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యాదోష్ శివకుమార్(27), కిష్టాపూర్కు చెందిన మన్నే శ్రీశైలం(27), వెంకటాయిపల్లికి చెందిన మన్నే నర్సింలు(28), దుబ్బాక మండలం బేగంపేటకు చెందిన కళ్లెం ప్రవీణ్(26), దుద్దెడకు చెందిన కొమ్ము ఎల్లయ్య(28), వర్గల్ మండలం నర్సంపల్లికి చెందిన ధరావత్ బాలు(25)లు పరిచయం పెంచుకున్నారు. తాను గతంలో దళంలో పని చేశానని అబద్ధాలు చెప్పి వారిని నమ్మించాడు.
దీంతో వీరందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. మక్బుల్ చెప్పిన విధంగా మెదక్, తూప్రాన్ పరిసర ప్రాంతాల్లో తాము మావోయిస్టులమని నమ్మ బలుకుతూ తమ వద్ద తుపాకులు ఉన్నాయని, కొత్తవారిని దళంలోకి తీసుకుంటున్నట్లు చెబుతూ వస్తున్నారు. గతంలో తాము నక్సలైట్లుగా ఉన్నప్పుడు అడవుల్లో పోలీసులకు దొరకకుండా డంపులు దాచి పెట్టినట్లు అమాయక ప్రజలను నమ్మించడం ప్రారంభించారు. ఇందుకోసం అడవుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయం నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ బడుగుల సుమతి ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ పోలీసులు, తూప్రాన్ పోలీసులు సంయుక్తంగా ఆరుగురు యువకులను గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు మావోయిస్టుల పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు అంగీకరించారు.
అలాగే అడవుల్లో తవ్వితే గతంలో నక్సలైట్లు దాచిన డంపులతోపాటు తుపాకులు లభిస్తాయని, వాటితో ప్రజలను సులువుగా బెదిరించి డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో వీరందరూ ముఠాగా ఏర్పడినట్లు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సత్ప్రవర్తన కలిగి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రుల సమక్షంలో నోట్ రాయించుకుని తూప్రాన్ తహసీల్దార్ నజీబ్ అహ్మద్ ఎదుట బైండోవర్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది యువకులు అడ్డదారుల్లో తిరుగుతున్న విషయంపై ఎస్పీ కార్యాలయంలో పూర్తి సమాచారం ఉందన్నారు. అయితే నకిలీ నక్సలైట్ మక్బుల్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సీఐ రమేశ్బాబు, తూప్రాన్, శివ్వంపేట ఎస్ఐలు వెంకటేశ్, రాజేశ్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.