విశాఖ జిల్లాకు ఉజ్వల భవి ష్యత్ ఉందని, అనతికాలంలోనే దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఆవిర్భవిస్తుందని పీఎంఓ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ వి.శేషాద్రి చెప్పారు.
విశాఖకు ఉజ్వల భవిష్యత్తు
Aug 9 2013 2:16 AM | Updated on Sep 1 2017 9:44 PM
చోడవరం,న్యూస్లైన్ : విశాఖ జిల్లాకు ఉజ్వల భవి ష్యత్ ఉందని, అనతికాలంలోనే దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఆవిర్భవిస్తుందని పీఎంఓ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ వి.శేషాద్రి చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని వనరులు విశాఖ జిల్లాలో ఉన్నాయన్నారు. చోడవరంలో ఆయనకు గురువారం పౌరసన్మానం చేశారు. రాజకీయ నాయకులు, విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజలను ఆయనను ఘనం గా సత్కరించారు. నీలం తుపాను సమయంలోను, ఎన్నికల్లోనూ, ఇతర అభివృద్ధి పనులు అమలులోనూ కలెక్టర్ సేవలు మరువ రానివని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పని చేయడం తన అదృష్టమని చెప్పారు. ప్రతి ఐఏ ఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా చేయాలని, విశాఖలాంటి జిల్లాలో పని చేయాలని కోరుకుంటారన్నా రు. అలాంటి అవకాశం తనకు వచ్చినా 11 నెలలు మాత్రమే పని చేయడం బాధగా ఉందని, ఇం కొంతకాలం పనిచేస్తే బాగుండుననిపిస్తోందన్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన పిఎం కార్యాలయంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, ఈ జిల్లా ప్రజలకు పిఎం కార్యాలయం నుంచి ఏ పనినైనా వెంటనే చేయడానికి తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
విశాఖ జిల్లా ప్రజలు చాలా సౌమ్యులని, బాధల్లో ఉన్నా ఎదుటి వారితో గౌరవంగానే మాట్లాడతారని ప్రజావాణి ద్వారా స్పష్టమయిందన్నారు. విద్యార్ధులు క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో లక్ష్యం చేరే దిశగా చదవాలని సూచిం చారు. అంతకు ముందు చోడవరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వయం భూ విఘ్నేశ్వర, స్వయంభూ గౌరీశ్వరాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డి.వి.రెడ్డి, అదనపు పోలీసు సూపరింటెండెంట్ కిషోర్, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎమ్డీ మజ్జి సూర్యభగవాన్, అనకాపల్లి డీఎస్పీ విఎస్ఎన్ మూర్తి, ఆర్డీవో సుబ్బరాజు, కురచానర్సింహనాయుడు, న్యాయవాధి చీపురపల్లి సూర్యనారాయణ, పట్టణ కాలేజీల అసోషియేషన్ ప్రతినిధులు నాగిరెడ్డి స్వామినాయుడు, జె.రమణాజీ, సిఐ విశ్వేశ్వరరావు, త హసీల్దార్లు శేషశైలజ, పి.అప్పలనాయుడు, ఎస్. భాస్కరరావు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement


