breaking news
Prestigious
-
‘మట్టి’ పద్మం!
పంట భూమికి పోషకాలను అందించాలన్నా.. చీడపీడల బెడద నుంచి పంటలను కాపాడుకోవాలన్నా కావాల్సిందేమిటి? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చివరకు కషాయాలు కూడా అవసరం లేదు.. కేవలం మట్టి ద్రావణం ఉంటే చాలు. ఇది రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఆవిష్కరించిన గొప్ప సంగతి. 12–13 ఏళ్ల నుంచి ద్రాక్ష, వరి, గోధుమ, కూరగాయ పంటలకు ఎరువుగా వేయడం, మట్టి ద్రావణాన్ని ద్రవరూప ఎరువుగా, పురుగుల మందుగా పిచికారీ చేయడం విశేషం. ఆయన పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని రుజువైంది. అంతేకాదు.. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వైపో)ను మెప్పించి, 2008లోనే 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందారు. చింతల వెంటకటరెడ్డి ఆవిష్కరణ గురించి ఏప్రిల్ 7, 2014న ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన సాక్షి ‘సాగుబడి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తదనంతరం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా ద్వారా చింతల వెంకట రెడ్డి(సి.వి.ఆర్.) సాగు పద్ధతి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు వివిధ పంటలపై మట్టి ద్రావణాన్ని వాడుతూ మండే ఎండల్లోనూ చక్కని పంట దిగుబడులు పొందుతుండడం హర్షదాయకం! ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు చింతల వెంకటరెడ్డి ఎంపికైన సందర్భంగా ఆయన ఆవిష్కరణ విశేషాలు మరోసారి.. మట్టి ద్రావణం.. కొన్ని మెలకువలు! నేలతల్లి అన్నపూర్ణ. అన్ని పోషకాలకూ నిలయం. అటువంటి మట్టిని సేకరించి పంటల సాగులో పోషకాల కోసం, చీడపీడల సమర్థ నివారణ కోసం వినియోగించుకునే వేర్వేరు పద్ధతులు, ఈ క్రమంలో రైతులు పాటించాల్సిన మెలకువలను రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) ‘సాగుబడి’కి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలపై రైతులు మట్టి ద్రావణాన్ని ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ బెర్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, టమాటో, వంగ, బీర, కాకర, దొండ, పూల తోటల్లో వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారన్నారు. అయితే, మల్బరీ తోటపై మట్టి ద్రావణం పిచికారీ చేయరాదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మట్టి ద్రావణం చల్లిన ఆకులు తింటే పట్టుపురుగులు కూడా చనిపోతాయన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ‘పై మట్టి’ అంటే? సీజనల్ పంటలు లేదా తోటలను తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచే మట్టిని సేకరించుకోవాలి. ఇతర భూముల నుంచి సేకరించడం ప్రారంభిస్తే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి. భూమి పైన 3–4 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని ‘పై మట్టి’(టాప్ సాయిల్) అని పిలుస్తున్నాం. దీన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే యంత్రాల సాయంతో సేకరించి, వర్షానికి తడవకుండా నిల్వ చేసుకోవాలి. ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి.. పంటల పోషణకు ఉపయోగపడుతుంది. ‘లోపలి మట్టి’ అంటే? పైమట్టిని తొలగించిన తర్వాత అదే భూమిలో మీటరు వెడల్పున 4 అడుగుల లోతు వరకు కందకం తవ్వాలి. ఇలా తవ్వి తీసిన మట్టి మొత్తాన్ని ‘లోపలి మట్టి’ (సబ్ సాయిల్) అని పిలుస్తున్నాం. ఈ మట్టిని కుప్పపోసి, కలియదిప్పాలి. ఆ మట్టి మొత్తాన్నీ లోపలి మట్టిగా వాడుకోవచ్చు. లోపలి మట్టిలో(నల్ల రేగడి మట్టిలో మరింత ఎక్కువ) జిగట ఉంటుంది. ఈ జిగట చీడపీడలను సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, లోపలి మట్టిని ఎండబెట్టి వాడితే పోషకాల శాతం పెరుగుతుంది. ఎండబెట్టకుండానే మట్టి ద్రావణం తయారీలో వాడినా పర్వాలేదు. పంటల పోషణ కోసం పిచికారీ ఇలా.. ఎకరానికి 200 లీ. నీరు+ 15 కిలోల పైమట్టి+ 15 కిలోల లోపలి మట్టిని బాగా కలియదిప్పి.. 45 నిమిషాలు ఉంచాలి. పై తేట నీటిని మాత్రమే వడకట్టి పంటలపై సాయంత్రం 4.30 తర్వాత చల్లపూట పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటే బలం. పంటలకు పోషకాలు అందించడానికి వాడే మట్టి నల్ల రేగడి మట్టి అయితే ఎక్కువ ప్రయోజనకరం. పోషకాల కోసం పైమట్టికి బదులుగా క్వారీల దగ్గర నుంచి సేకరించే రాయిపొడిని వాడితే మరీ మంచిది. చీడపీడల నివారణ కోసం పిచికారీ ఇలా.. ► చీడపీడల నివారణకు జిగట ఉన్న ‘లోపలి మట్టి’ని మాత్రమే నీటిలో కలిపి వాడాలి. ఎర్ర మట్టి అయినా, నల్ల మట్టి అయినా అందులో జిగట ఉంటేనే చీడపీడలు పోతాయి. 200 లీ. నీటిలో 20 కిలోల లోపలి మట్టిని వేసి బాగా కలపాలి. అర గంట తర్వాత పైకి తేరుకున్న 170 లీటర్ల నీటిని పంటలపై పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను పంట మొక్కలు, చెట్ల మొదళ్లలో వేసుకోవచ్చు. పైమట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైమట్టిని కూడా కలిపితే చీడపీడలు త్వరగా కంట్రోల్ కావు. ► మట్టి ద్రావణంతోపాటు ఎకరానికి 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు మూత్రం లేదా లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, చేప అమినో ఆమ్లం కలిపితే.. ఉదయం / సాయంత్రం చల్లని వేళ్లల్లో మాత్రమే పిచికారీ చేయాలి. ► పంటల పోషణకు లేదా చీడపీడల నివారణకు కేవలం మట్టి ద్రావణాన్నే పిచికారీ చేయదలచుకుంటే.. 44 డిగ్రీల ఎండకాసేటప్పుడు మిట్ట మధ్యాహ్నమైనా పిచికారీ చేయొచ్చు. ► కూరగాయ తోటలకైతే మట్టి ద్రావణాన్ని 3–4 రోజులకోసారి పిచికారీ చేయాలి. టమాటో, వంగ, బీర తోటలకు వారానికోసారి కొట్టొచ్చు. ► పంటల పోషణ కోసమైతే మట్టి ద్రావణాన్ని కలిపిన అరగంట తర్వాత వడకట్టి వాడాలి. కలిపిన అరగంట తర్వాత 3–4 గంటలలోపు ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ► చీడపీడల నివారణ కోసం కలిపిన లోపలి మట్టి ద్రావణమైతే వడకట్టి నిల్వపెట్టుకొని ఎన్నాళ్ల తర్వాతయినా కలియదిప్పి పిచికారీ చేసుకోవచ్చు. ► ఇతర వివరాల కోసం సికింద్రాబాద్లోని ఓల్డ్ ఆల్వాల్ వాస్తవ్యుడైన చింతల వెంకటరెడ్డిని 98668 83336 నంబరులో లేదా e-mail: cvreddyind@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. మట్టి ద్రావణం మట్టి ఎరువు, ద్రావణంతో సాగైన ద్రాక్ష తోట -
33 జిల్లాలు, 33 ర్యాలీలు
-
33 జిల్లాలు, 33 ర్యాలీలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టేలా గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో 33 బహిరంగ ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఒక్కో జిల్లాలో 3 నుంచి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రధాని ఎన్నికల షెడ్యూల్ రూపకల్పనపై కసరత్తు సాగుతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 20 తర్వాత మోదీ గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశముంది. గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి విభిన్నంగా మోదీ ప్రచార పర్వం ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నిజానికి గత 22 ఏళ్లుగా బీజేపీనే గుజరాత్ను పాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ప్రజా వ్యతిరేకత ప్రభావం పడకుండా రక్షణాత్మక ధోరణితో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం కుల సమీకరణాలతో బలమైన కూటమి ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కులతత్వాన్ని రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఇప్పటికే ఆరోపించారు. పటీదార్ వర్గ నేత హార్దిక్తోపాటు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్, ఎస్పీ వర్గానికి చెందిన జిగ్నేష్ మేవానీల్ని కాంగ్రెస్ ఇప్పటికే తనవైపుకు తిప్పుకుంది. అలాగే జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. జీఎస్టీ శ్లాబుల్లో తాజా మార్పులతో ప్రజల ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే జీఎస్టీపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గుజరాతీయుల మనసు మార్చే వ్యూహంతో.. గుజరాత్ అభివృద్ధి కోసం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఆరోపించారు. ఈసారి కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ అభివృద్ధిపై ఆ రాష్ట్ర ప్రజల్ని మోదీ ఏ మేరకు నమ్మిస్తారో వేచిచూడాలి. మోదీ ప్రధానిగా ఉన్నప్పటి కంటే సీఎంగా ఉన్నప్పుడే తమ పరిస్థితి బాగుండేదని ఆ రాష్ట్ర ప్రజల్లో బలపడుతున్న ఆలోచనా ధోరణిని ఎదుర్కోవడం ఆయన ముందున్న మరో సవాలు. ఈ ప్రతికూలతల నేపథ్యంలో ఎలాగైనా గుజరాత్ ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేలా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భారీ ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు. -
విశాఖకు ఉజ్వల భవిష్యత్తు
చోడవరం,న్యూస్లైన్ : విశాఖ జిల్లాకు ఉజ్వల భవి ష్యత్ ఉందని, అనతికాలంలోనే దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఆవిర్భవిస్తుందని పీఎంఓ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ వి.శేషాద్రి చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని వనరులు విశాఖ జిల్లాలో ఉన్నాయన్నారు. చోడవరంలో ఆయనకు గురువారం పౌరసన్మానం చేశారు. రాజకీయ నాయకులు, విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజలను ఆయనను ఘనం గా సత్కరించారు. నీలం తుపాను సమయంలోను, ఎన్నికల్లోనూ, ఇతర అభివృద్ధి పనులు అమలులోనూ కలెక్టర్ సేవలు మరువ రానివని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పని చేయడం తన అదృష్టమని చెప్పారు. ప్రతి ఐఏ ఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా చేయాలని, విశాఖలాంటి జిల్లాలో పని చేయాలని కోరుకుంటారన్నా రు. అలాంటి అవకాశం తనకు వచ్చినా 11 నెలలు మాత్రమే పని చేయడం బాధగా ఉందని, ఇం కొంతకాలం పనిచేస్తే బాగుండుననిపిస్తోందన్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన పిఎం కార్యాలయంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, ఈ జిల్లా ప్రజలకు పిఎం కార్యాలయం నుంచి ఏ పనినైనా వెంటనే చేయడానికి తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా ప్రజలు చాలా సౌమ్యులని, బాధల్లో ఉన్నా ఎదుటి వారితో గౌరవంగానే మాట్లాడతారని ప్రజావాణి ద్వారా స్పష్టమయిందన్నారు. విద్యార్ధులు క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో లక్ష్యం చేరే దిశగా చదవాలని సూచిం చారు. అంతకు ముందు చోడవరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వయం భూ విఘ్నేశ్వర, స్వయంభూ గౌరీశ్వరాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డి.వి.రెడ్డి, అదనపు పోలీసు సూపరింటెండెంట్ కిషోర్, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎమ్డీ మజ్జి సూర్యభగవాన్, అనకాపల్లి డీఎస్పీ విఎస్ఎన్ మూర్తి, ఆర్డీవో సుబ్బరాజు, కురచానర్సింహనాయుడు, న్యాయవాధి చీపురపల్లి సూర్యనారాయణ, పట్టణ కాలేజీల అసోషియేషన్ ప్రతినిధులు నాగిరెడ్డి స్వామినాయుడు, జె.రమణాజీ, సిఐ విశ్వేశ్వరరావు, త హసీల్దార్లు శేషశైలజ, పి.అప్పలనాయుడు, ఎస్. భాస్కరరావు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.