ప్రజలపై భారం | burden on people | Sakshi
Sakshi News home page

ప్రజలపై భారం

Jul 21 2016 10:48 PM | Updated on May 25 2018 9:20 PM

ప్రజలపై భారం - Sakshi

ప్రజలపై భారం

అడ్డదారిలో పన్ను భారాలు మోపి టీడీపీ పాలకులు నగర ప్రజల్ని దొంగదెబ్బ తీశారని వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బండి నాగేంద్ర పుణ్యశీల ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌ కార్యాలయంలోని వైఎస్సార్‌ సీపీ చాంబర్లో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సి ఉండగా ఏడాది బిల్లు ఒకేసారి ఇస్తున్నారన్నారు.

అడ్డదారిలో పన్ను భారాలు
పచ్చ నేతల నిర్ణయాలతో ఇబ్బందులు 
వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ పుణ్యశీల ధ్వజం 
విజయవాడ సెంట్రల్‌ : 
అడ్డదారిలో పన్ను భారాలు మోపి టీడీపీ పాలకులు నగర ప్రజల్ని దొంగదెబ్బ తీశారని వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బండి నాగేంద్ర పుణ్యశీల ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌ కార్యాలయంలోని వైఎస్సార్‌ సీపీ చాంబర్లో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సి ఉండగా ఏడాది బిల్లు ఒకేసారి ఇస్తున్నారన్నారు. నీటి, డ్రెయినేజీ చార్జీలు అనూహ్యంగా పెంచేశారని వివరించారు. పూరిపాకలకు సైతం రూ.పది వేలు డిమాండ్‌ నోటీసులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 21 శాతం మేర నీటి చార్జీలు పెరిగాయని విమర్శించారు. తాజాగా డ్రెయినేజీ చార్జీలను ఏడు శాతం పెంపుదల చేశారని ఆరోపించారు. డిమాండ్‌ నోటీసుల్ని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో పెంపుదల చేసిన ఏడు శాతం నీటి చార్జీలను ఉపసంహరించుకోవాలని మొదటి కౌన్సిల్‌లోనే పాలక, ప్రతిపక్షాలు తీర్మానం చేసినా ఇంత వరకు అమల్లోకి రాలేదని వివరించారు. ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపిన మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అడ్డదారిలో ప్రజలపై పన్ను భారాలు మోపుతున్నారని విమర్శించారు. ప్రైవేటు సర్వే ఆధారంగానే డిమాండ్‌ నోటీసుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్‌ సిబ్బందిని కాదని ప్రైవేటు సర్వే ఎందుకు చేయించారో మేయర్, కమిషనర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పన్నులు ఎలా పెంపుదల చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మేయర్‌ నియంతలా వ్యవరిస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిన టీడీపీ పాలకులు భస్మాసుర హస్తాన్ని మోపుతున్నారన్నారు. పెంచిన పన్ను భారాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజలపక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తోందని హెచ్చరించారు. కార్పొరేటర్లు బుల్లా విజయ్, అవుతు శ్రీశైలజ, పాల ఝాన్సీలక్ష్మి, కరీమున్నీసా పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement