ఆటోడ్రైవర్‌ బలవన్మరణం | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ బలవన్మరణం

Published Mon, Jul 25 2016 1:59 AM

auto driver suicide

కొవ్వూరు: పట్టణంలో బ్రిడ్జిపేటకి చెందిన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బ్రిడ్జిపేటలో నివాసముంటున్న పైలా శ్రీను (30) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కువైట్‌లో ఉంటూ ఇటీవల స్వదేశం వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటలకు శ్రీను ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 8.30 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. తన భార్య కువైట్‌ నుంచి వచ్చిందని, అమ్మగారింట్లోనే ఉంటానని చెప్పిందని తల్లి పైడమ్మకు చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో గదిలో లైటు వెలుగుతుందని కిటికీలో నుంచి తల్లి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికులు సాయంతో తల్లి శ్రీనును ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భార్య కాపురానికి రావడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి పైడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ పి.ప్రసాదరావు తెలిపారు. 
 

Advertisement
Advertisement