‘అనంత’ ఆర్టీసీ.. మీకు తెలుసా? | Sakshi
Sakshi News home page

‘అనంత’ ఆర్టీసీ.. మీకు తెలుసా?

Published Fri, May 12 2017 11:12 PM

‘అనంత’ ఆర్టీసీ.. మీకు తెలుసా? - Sakshi

హాయ్‌ చిన్నారులూ.. జిల్లాలో మనం నిత్యమూ చూస్తున్న ఆర్టీసీ బస్సులు.. వాటి నిర్వహణను పర్యవేక్షించి డిపోల ఏర్పాటు గురించి మీకు తెలుసా? అసలు అనంతపురంలో ఆర్టీసీ డిపో ప్రారంభమే నేటికి 54 సంవత్సరాలైందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే! ఎందుకంటే 1963లో కర్నూలు డిపోకు అనుబంధంగా అనంతపురంలో ఆర్టీసీ సంస్థ ఓ చిన్న డిపోను ప్రారంభించింది. అప్పుడు అనంతపురం నుంచి నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లకు సర్వీసులు ప్రారంభించారు. తర్వాత బస్సుల సంఖ్య క్రమంగా పెంచుతూ వచ్చారు. 1978 మార్చిలో జిల్లాలోని రూట్లను ప్రభుత్వం జాతీయం చేసింది.

అనంతపురం జిల్లాను ప్రత్యేక డివిజన్‌గా మారుస్తూ.. 240 బస్సులతో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించారు. దీని కోసం హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, తాడిపత్రి ప్రాంతాల్లో బస్సు డిపోలు ఏర్పాటు చేశారు. అనంతపురంలో బస్సుల సంఖ్య పెరగడంతో 1980లో గుంతకల్లులోను, ధర్మవరంలోను కొత్తగా డిపోలు ప్రారంభించారు. ఆ తర్వాత 1988లో గుత్తిలో, 1989లో రాయదుర్గంలో డిపోలను ప్రారంభించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, విజయవాడ, తిరుపతి తదితర పట్టణాలకు బస్సు సౌకర్యం మెరుగపడింది. 1991లో హిందూపురం కేంద్రంగా కొత్త డివిజన్‌ రూపొందించారు. అప్పట్లో ఈ డివిజన్‌ పరిధిలో హిందూపురం, కదిరి, ధర్మవరం డిపోలతో పాటు బెంగుళూరు పాయింట్‌ను కూడా చేర్చారు. ఇక తర్వాతి కాలంలో మడకశిర, పుట్టపర్తి, ఉరవకొండ, పెనుకొం‍డ, గోరంట్ల పట్టణాల్లో బస్సు డిపోలను నెలకొల్పారు.

Advertisement
Advertisement