ఎయిడ్స్‌ ప్రాజెక్టు ఉద్యోగుల ఆందోళన | aids project employees protest | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ ప్రాజెక్టు ఉద్యోగుల ఆందోళన

Dec 9 2016 11:43 PM | Updated on Mar 28 2019 8:28 PM

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణకు సంబంధించి క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేస్తున్న తమకు పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎయిడ్స్‌ ప్రాజెక్ట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

- 10 నెలలుగా జీతాలు లేవని నిరసన
- రాయలసీమ స్థాయి సమావేశం బహిష్కరణ
 
కర్నూలు(హాస్పిటల్‌): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణకు సంబంధించి క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేస్తున్న తమకు పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎయిడ్స్‌ ప్రాజెక్ట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ఎయిడ్స్‌ ప్రాజెక్టు ఎన్‌జీఓలు, ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లతో ఏపీ శాక్స్‌ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించారు. తమ ప్రాజెక్టులో డైరెక్టర్లతో పాటు మేనేజర్లు, ఔట్‌ రీచ్‌ వర్కర్లు, క్షేత్రస్థాయిలో సెక్స్‌వర్కర్లు హెచ్‌ఐవీ నివారణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసీటీసీ, పీపీటీసీల్లో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంతోపాటు పెంచారన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరి పూనం మాలకొండయ్యకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. కాగా ఏపీ శ్యాక్స్‌ జేడీ చంద్రశేఖర్, టీం లీడర్‌ వెంకట్‌ ఎదుట పలువురు ఎన్‌జీఓ ప్రతినిధులు సైతం నిధుల విడుదలపై నిలదీశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జేడీ తెలిపారు. ఆందోళనలో ప్రోగ్రామ్‌ మేనేజర్లు మురళి, బాబు(చిత్తూరు), శాంతిరాజు(కర్నూలు), సూర్యనారాయణ, శేషాద్రి(అనంతపురం), మురళి(చిత్తూరు) తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement