జీతాలు పెంచాలని నిరసన
ఏసీ కళాశాల అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ ఎయిడెడ్ టీచర్స్ ఫెడరేషన్..
ఏసీ కళాశాల అన్ఎయిడెడ్ అధ్యాపకుల ఆందోళన
గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాల అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ ఎయిడెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ కళాశాలలో 62 మంది అన్ ఎయిడెడ్ అధ్యాపకులు రూ. 3,500ల జీతానికి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి రూ. 25 వేలకు జీతం పెంచాలని తాము అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళాశాలకు అనుబంధంగా ఉన్న వివిధ ప్రాంగణాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందన్నారు.ఇది దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి శంకుస్థాపనను అడ్డుకుంటాం..
ఏఈఎల్సీ ఆస్తుల పరిరక్షణ సమితి జేఏసీ అధ్యక్షులు పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ జనవరి 26వ తేదీన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద కళాశాలలో నిర్మించబోయే భవన శంకుస్థాపనను తాము అడ్డుకుంటామన్నారు. జీతాలు పెంచకపోతే ముఖ్యమంత్రి హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అధ్యాపకుల జీతాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటరత్నం, డాక్టర్ గురవయ్య, నీలాంబరం, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.