సిటీసెంటర్‌ మాల్‌లో యువతి వీరంగం | woman attacks couple in hyderabad citycentre mall | Sakshi
Sakshi News home page

సిటీసెంటర్‌ మాల్‌లో ఎంపీ కూతురినంటూ దాడి

Oct 23 2017 8:12 AM | Updated on Jul 10 2019 7:55 PM

woman  attacks couple in hyderabad citycentre mall  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శి సురేష్‌ (50), ఆయన భార్య భాను (44)లపై హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్‌ మాల్‌లో ఎంపీ కూతురినంటూ ఓ యువతి దాడికి పాల్పడింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సిటీసెంటర్‌ మాల్‌లో సీసీ పుటేజీలు పరిశీలించి యువతి కోసం గాలింపు చేపట్టారు. సురేష్, భాను దంపతులు ఆదివారం సిటీసెంటర్‌ మాల్‌కు రాగా, ఓ యువతి వీరిని ఢీకొట్టి వడివడిగా లిఫ్ట్‌లోకి ప్రవేశించింది.

అంతటితో ఊరుకోకుండా కళ్లు కనిపించట్లేదా అంటూ.. సురేష్‌ దంపతులనే బెదిరించింది. సెక్యూరిటీ గార్డులతో పాటు షాపింగ్‌కు వచ్చిన వారు వారిస్తున్నా వినకుండా నేను ఎంపీ కూతురిని అంటూ గన్‌మెన్‌లను పిలుస్తున్నానని, కాల్చేస్తానంటూ వారిపై దాడికి దిగింది. బాధితులు వారి కారు దగ్గరకు వెళ్లబోతుండగా అడ్డగించి మరీ దాడికి యత్నించింది. సెక్యూరిటీ గార్డుల భద్రత నడుమ వారిద్దరు అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. కోటి విలువ చేసే ఆమె కారు నంబర్‌ను బాధితులు గుర్తించి పోలీసులకు అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement