
సాక్షి, విజయవాడ : విజయవాడ నగరంలో కిడ్నాప్ కలకలం రేగింది. నగరంలో బుధవారం అర్ధరాత్రి కిడ్నాపైన ఇద్దరు యువకులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అజిత్సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీలో పల్సర్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ద్విచక్రవాహనం (పల్సర్ బైక్ నెంబర్ ఏపీ 16 వీజెడ్ 3457) పై వెళ్తున్న యువకులను కారులో వెంబడించిన ఆరుగురు వ్యక్తులు వారిపై దాడి చేసి బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకొని పరారయ్యారు.
ఇది గుర్తించిన స్థానికులు కిడ్నాప్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ 7 డీయూ 5587 నెంబర్ గల కారులో దుండగులు వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. విజయవాడ పోలీసులు గుంటూరు పోలీస్ బృందానికి సమాచారం అందించారు. ఈ వివరాలతో దర్యాప్తు చేపట్టిన గుంటూరు పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలో ఈ కిడ్నాప్నకు కారణమై ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.