
గుడివాడ టౌన్(గుడివాడ): రుణం కోసం వెళ్లిన మహిళను తన కోరిక తీర్చమని టీడీపీ కౌన్సిలర్ భర్త వేధించాడు. తన గోడును కౌన్సిలర్కు చెప్పుకోవడానికి వెళ్తే తిరిగి బాధితురాలిపైనే దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. కేసు వివరాలను గుడివాడ వన్టౌన్ సీఐ రమణ శనివారం విలేకరులకు తెలిపారు.
ఆయన కథనం మేరకు.. గుడివాడ పట్టణం 34వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బొడ్డు శివశ్రీ భర్త బొడ్డు నారాయణ వార్డుకు చెందిన ఓ మహిళకు రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తిప్పించుకుంటున్నాడు. పది రోజుల కిందట రుణం గురించి మాట్లాడాలంటూ ఆ మహిళను ఇంటికి పిలిపించి లైంగికదాడికి యత్నించగా ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. కొన్నాళ్లుగా మానసిక క్షోభ అనుభవించిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి విషయాన్ని కౌన్సిలర్ బొడ్డు శివశ్రీ దృష్టికి తీసుకెళ్లేందుకు వారి ఇంటికి వెళ్లింది.
భర్తతో క్షమాపణ చెప్పిస్తానని లోపలికి పిలిచి తలుపులు వేసిన కౌన్సిలర్ శివశ్రీ.. భర్తతో కలసి బాధితురాలి బంధువులపై దోమలమందు హిట్ స్ప్రే చేసి, దాడికి తెగబడ్డారు. వారి నుంచి ఓ మహిళ తప్పించుకుని బయటకు వచ్చి కేకలువేయగా చుట్టుపక్కల వారు మిగిలినవారిని విడిపించారు. ఈ సంఘటనలో కౌన్సిలర్ శివశ్రీకి స్థానికులు దేహశుద్ధి చేశారని సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు బొడ్డు నారాయణ, అతని భార్య శివశ్రీపై ఐపీసీ 354, విషపదార్థాలతో దాడి, బెదిరింపులుపై కేసు నమోదు చేశారు. శివశ్రీ ఫిర్యాదు మేరకు మరో ఏడుగురుపై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.