టీడీపీ గూండాల అరాచకం

TDP activists attack On YSRCP Leaders - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది కారుపై బండరాళ్లతో దాడి  

సామాజికవర్గం పేరుతో దూషణలు  

గ్రామాల్లో ఎమ్మెల్యేను తిరగనిచ్చేదిలేదంటూ హెచ్చరికలు  

చిలకలూరిపేట: టీడీపీకి చెందిన గూండాలు బండరాళ్లు, కర్రలు, మారణాయుధాలతో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారుపై దాడికి తెగబడ్డారు. కారులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజని ఉన్నట్లు భావించి జరిపిన దాడిలో ఆమె మరిది విడదల గోపీనాథ్, మరో ఆరుగురు గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రజని స్వగ్రామం పురుషోత్తమపట్నంలో పార్టీ కార్యకర్తలు ఐదు భారీ విద్యుత్‌ ప్రభలను ఏర్పాటుచేశారు. వీటిని గురువారం రాత్రి ఆమె మరిది గోపీనాథ్‌ తన మిత్రులైన పార్టీ ఇతర నేతలతో కలిసి కోటప్పకొండ సమీపంలోని ఈటీ జంక్షన్‌కు చేర్చి, రాత్రి ఒంటిగంట సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు.  

ఒక్కసారిగా బండరాళ్లతో దాడి 
మండలంలోని కమ్మవారిపాలెం, మద్దిరాల, యడవల్లి గ్రామాలకు చెందిన టీడీపీలోని ఓ సామాజికవర్గం నేతలు, కార్యకర్తలు ప్రభల వద్ద మైకులతో అందరూ ఒకేచోటకు చేరుకోవాలని ప్రకటించారు. ఈ విషయం తెలీని గోపీనాథ్, అతని అనుచరులు కారులో అదే మార్గంలోకి వచ్చారు. దీంతో 200 మందికి పైగా ఉన్న టీడీపీ వర్గీయుల గుంపు వారి కారుకు ట్రాక్టర్‌ను అడ్డుగా పెట్టి ఒక్కసారిగా బండరాళ్లు విసరటం ప్రారంభించారు. ఎక్కడ్రా మీ ఎమ్మెల్యే.. మా సామాజికవర్గానికి చెందిన నియోజకవర్గంలో ఆమె ఎలా గెలుస్తుందంటూ సామాజికవర్గం పేరుతో దుర్భాషలకు దిగారు. ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని బెదిరించారు. ఈ సమయంలో కారును డ్రైవర్‌ చాకచక్యంగా తప్పించగా గోపీనాథ్‌ బైక్‌పై వెళ్లిపోయారు. ఈ çఘటనలో గోపీనాథ్‌తో పాటు కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు అద్దాలతో పాటు ముందు భాగం ధ్వంసమైంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ హెచ్చరించారు.   
మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాధరాజు, పక్కన ఎమ్మెల్యే రజని, గోపీనాథ్‌ 

దాడి దుర్మార్గం మంత్రి శ్రీరంగనాథరాజు 
టీడీపీ వర్గీయుల దాడి దుర్మార్గమని గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని ఓర్వలేకే ఈ దాడిని చేసినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఎవరిని టార్గెట్‌ చేసి చేశారో టీడీపీ గూండాల వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోందని ఎమ్మెల్యే రజని అన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top