పరిగెడుతూ బావిలో పడి విద్యార్థి మృతి

The student died in the well while running - Sakshi

రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌) : పట్టణంలోని బీ జోన్‌కు చెందిన గంగాధరి శ్రావణ్‌కుమార్‌ (24) అనే విద్యార్థి కరీంనగర్‌ జిల్లా ముగ్దుంపూర్‌ సమీపంలోని ఓ బావిలో పడి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. నిగమ కళాశాలలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు చెందిన తోటి స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం బయటికి వెళ్లాడు. వారంతా ఓ చోట కూర్చొని ఉండగా పోలీస్‌ వాహనం సైరన్‌ వినిపించడంతో అక్కడి నుంచి పారిపోయారు.

శ్రావణ్‌కుమార్‌ కనిపించకపోవడంతో పోలీసులే తీసుకెళ్లి ఉండొచ్చని స్నేహితులు భావించా రు. ఫోన్‌ కూడా లిఫ్ట్‌ కాకపోవడంతో కంగారు పడ్డారు. బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పరిసర ప్రాంతంలోని ఓ బావిలో మృతదేహం బయటపడింది.

దీంతో బీజోన్‌ ఏరియాలో విషాదం అలముకుంది. టైలరింగ్‌ పనిచేసే నారాయణకు కుమార్తె, కుమారుడు ఇద్దరు సంతానం. కూతురుకు వివాహం కాగా.. శ్రావణ్‌కుమార్‌ను చదివిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలన్న తల్లిదండ్రుల కలల్ని విధి కల్లలు చేసింది. కాగా.. స్నేహితలంతా కలిసి ఓ చోట మద్యం సేవిస్తుండగా పోలీసు వాహనం సైరన్‌ విని పారిపోయే ప్రయత్నంలో చీకటల్లో ఈ దుర్ఘటన జరిగిందని చర్చించుకుంటున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top