రూ.లక్షకు.. రూ.5లక్షలు

Police Revealed Details Of Old Currency Dump In Khammam - Sakshi

ఘరానా మోసాన్ని ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేష్‌

బాధితుడి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు

మర్లపాడులో పాత కరెన్సీ డంపును ఏర్పాటు చేసి కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్న షేక్‌ మదార్‌ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. మర్లపాడులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేష్‌ మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్‌ మదార్‌ ముఠాకు చెందిన వ్యక్తులు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నామంటూ.. మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామోదర్‌ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

సాక్షి, వేంసూరు(ఖమ్మం) : మర్లపాడులో పాత కరెన్సీ డంపును ఏర్పాటు చేసి కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్న షేక్‌ మాదార్‌ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. మర్లపాడులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేష్‌ మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్‌ మాదర్‌ ముఠాకు చెందిన వ్యక్తులు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నామంటూ.. మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామోదర్‌ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గదిలో చెలమణిలో లేని (పాత) రూ.500,1000 నోట్లను కంటెయినర్‌ తరహాలో అమర్చి.. తన వద్ద రూ.కోట్ల పాత నోట్లు ఉన్నాయని.. కొత్త నోట్లు రూ.లక్ష ఇస్తే.. ఐదు రెట్లు పాత నోట్లు ఇస్తానని, వీటిని ఆర్‌బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఉందని నమ్మించేవాడు. తన వద్ద ఎక్కువ మొత్తంలో బ్లాక్‌ మనీ ఉందని నమ్మించడానికి నోట్ల కట్టల మధ్యలో డమ్మీ నోట్లు ఉంచి ఆ నోట్ల కట్టలను వీడియో తీసి ఆశ చూపి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. మదార్‌పై గతంలో వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు.

పంటరుణాలు ఇస్తామంటూ రైతులను..
భూమి పాసు పుస్తకం జిరాక్స్, రూ.5 లక్షలు ఇస్తే తాము పంటరుణంగా ఉన్న భూమిని బట్టి రూ.10 నుంచి 40 లక్షల వరకు ఇస్తానని, రైతులను నమ్మించేందుకు తాను గదిలో దాచుకున్న పాత నోట్ల కట్టల డంపును చూపేవాడని, అధిక మొత్తం రుణం వస్తుందనే నమ్మకంతో రైతులు అడిగినంత ఇస్తే.. తరువాత అడ్రస్‌ లేకుండా పోయి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 

రూ.28లక్షలకు రూ.కోటి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన ఉండేటి ప్రసాద్‌ అనే వ్యక్తి నుంచి రూ.28లక్షలు తీసుకొని దానికి బదులుగా రూ.కోటి ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు మదార్, వేంసూరు మండలం చౌడవరం గ్రామానికి చెందిన గాయం వెంకటనారాయణ, దమ్మపేట మండలం గండుగుల పల్లికి చెందిన తోట హనుమంత్‌రావులపై ఆర్‌బీఐ ఎస్‌బీఎన్‌ యాక్ట్‌ 420 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ యాక్ట్‌ కింద జిల్లాలో ఇదే తొలి కేసు అని చెప్పారు. కార్యక్రమంలో సత్తుపల్లి సీఐ రమాకాంత్, సత్తుపల్లి రూరల్‌ సీఐ కరుణాకర్, వేంసూరు ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top