ఇద్దరు దొంగలపై పీడియాక్ట్‌ నమోదు | PD Act On Two Thieves | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగలపై పీడియాక్ట్‌ నమోదు

May 5 2018 12:48 PM | Updated on May 5 2018 12:48 PM

PD Act On Two Thieves - Sakshi

కేతావత్‌ రాజు(ఫైల్‌)ఉత్తమ్‌కుమార్‌(ఫైల్‌)

రాజేంద్రనగర్‌ రంగారెడ్డి : వరుస దొంగతనాలకు పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలపై సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. గత నెలలో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు చిక్కిన ఇద్దరిపై మొదటిసారిగా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అప్కోకాలనీలో సతీష్‌ ఉత్తమ్‌కుమార్‌ రాథోడ్‌(24), కేతావత్‌ రాజు(25)లు నివసిస్తున్నారు.

రాథోడ్‌ ప్రైవేటు డ్రైవర్‌ కాగా, రాజు కూలి పని చేస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఆదర్శ్‌నగర్‌కాలనీ, ముస్తాఫానగర్, టీఎన్‌జీఓస్‌ కాలనీ, టాటానగర్, మధుబన్‌కాలనీలలో సంచరిస్తూ ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం ఇళ్లల్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను తస్కరించేవారు. కేవలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 8 దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనమే వృత్తిగా ఎంచుకున్న వీరు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం తిరిగి ఇదే దందాను కొనసాగిస్తున్నారు.

దీంతో పోలీసులతో పాటు స్థానికులకు కంటినిద్ర కరువైంది. గత నెల 7వ తేదీన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు నిందితులిద్దరూ పట్టుబడ్డారు. ఆ సమయంలో వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సైబరాబాద్‌ కమిషనర్‌ శుక్రవారం పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు.       

Advertisement
 
Advertisement
Advertisement