ఎమ్మెల్యే ‘చల్లా’ క్షమాపణ చెప్పాలి   | MLA should apologize | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ‘చల్లా’ క్షమాపణ చెప్పాలి  

Jun 2 2018 11:27 AM | Updated on Apr 4 2019 2:50 PM

MLA should apologize - Sakshi

కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ట్రెస్సా నాయకులు  

వరంగల్‌ రూరల్‌ : కలెక్టరేట్‌ సూపరింటెండెట్, తహసీల్దార్‌ జి.సదానందం, నర్సంపేట తహసీల్దార్‌ పూల్‌ సింగ్‌పై అనుచితంగా ప్రవర్తించిన పరకాల ఎమ్యెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని గెజిటెడ్‌ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణను శనివారం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సదానందం, పూల్‌ సింగ్‌పై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అతడి గన్‌మెన్, పరకాల జెడ్పీటీసీ పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాప్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తహసీల్‌ కార్యాలయాల ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలు నిర్వహించారు.

కలెక్టరేట్‌ ఎదుట జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులు, ట్రెస్సా నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఈ-సెక్షన్‌ సూపరింటెండెంట్, తహసీల్దార్‌ జి.సదానందం మాట్లాడుతూ తాను లంచం అడిగినట్టు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలో నిజం లేదని, కావాలని తాను ఫైల్‌ విషయంలో జాప్యం చేయలేదన్నారు.

నర్సంపేట తహసీల్దార్‌ పూల్‌ సింగ్‌ మాట్లాడుతూ సదానందంతోపాటు తనపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆయన ఇద్దరు గన్‌మెన్లు, పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడికల్పనా దేవి, ఆమె భర్త పాడి ప్రతాపరెడ్డి, ఇద్దరు ఎమ్యేల్యే గన్‌మెన్లు దాడి చేశారని ఆరోపించారు.

నిరసన ప్రదర్శనలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు పి.సత్యనారాయణ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె.సత్యనారాయణ, కార్యదర్శి కె.విక్రమ్‌కుమార్, టీఎన్‌జీఓల సంఘం కార్యదర్శి షఫీ, రత్నవీరాచారి, టీఈఏ అధ్యక్షుడు కె.యాదగిరి, టీఎస్‌ఎస్‌ఏ అధ్యక్షుడు కె.రమేష్, టీజీటీఏ అధ్యక్షులు రాంమూర్తి, కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షుడు రమేష్, జిల్లా అధ్యక్షురాలు సుహసిని, టీఆర్‌ఈఎస్‌ఏ ఆర్గనైజింగ్‌ రాష్ట్ర కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఈఎస్‌ఏ నాయకులు ఫణికుమార్, టీజీటీఏ అసిస్టెంట్‌ ప్రెసిడెంట్‌ పూల్‌ సింగ్, టీఈఏ అధ్యక్షుడు వేణుగోపాల్, ఎంఈడబ్ల్యూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ.రియాజ్, ఆఫీస్‌ సబార్డినేట్‌ యాకుబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement