ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Minor Boys Gang Molestation On Girl In West Godavari - Sakshi

నలుగురు బాలల అత్యాచారం

తణుకు మండలం తేతలిలో ఘటన

పోలీసుల అదుపులో నిందితులు

పశ్చిమగోదావరి, తణుకు : తెలిసీ తెలియని వయసు.. సినిమాలు, సెల్‌ఫోన్‌ల ప్రభావం.. ఆ బాలలను దారితప్పేలా చేసింది. ఫలితంగా అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టించింది. తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అ«ఘాయిత్యానికిపాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తేతలి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక తణుకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం చిన్నారి అమ్మమ్మ ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ ఉండగా నలుగురు మైనర్‌ బాలలు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆడుకుందాం రా అని
తేతలి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఆడుకుంటున్న బాలికకు సమీపంలో నివాసం ఉంటున్న ఎనిమిది, నాలుగు, రెండో తరగతి చదువుతున్న ఇద్దరు మొత్తం నలుగురు మైనర్‌ బాలలు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఆడుకుంటున్న చిన్నారితో కాసేపు ఆడుకున్న వీరంతా ఇక్కడ కాదు అంటూ సమీపంలోని ఒకటో నెంబరు ప్రాథమిక పాఠశాల వద్దకు తీసుకెళ్లారు. పాఠశాల వెనుక ప్రాంతానికి తీసుకెళ్లిన వీరంతా ఆ బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుస్తున్న ఆమెను కొద్దిసేపు అక్కడే ఉంచి అనంతరం ఇంటికి పంపించి వేశారు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని అమ్మమ్మ, పెద్దమ్మతో చెప్పింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడిన బాలల ఇళ్లకు వెళ్లిన చిన్నారి బంధువులు వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్సై సీహెచ్‌వీ రమేష్‌ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ కేఏ స్వామి తేతలిలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వికటించిన ‘పంచాయితీ’
తేతలి గ్రామంలో చోటుచేసుకున్న అఘాయిత్యం ఆ నోటా ఈ నోటా గ్రామం అంతా పాకింది. ఇదే సమయంలో అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు బాలలకు చెందిన కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సర్పంచి కోట నాగేశ్వరరావు వద్దకు చేరుకున్నారు. తమ పిల్ల లను కాపాడాలని కోరడంతో బాధిత బాలిక తల్లిదండ్రులతో శుక్రవారం సాయంత్రం గ్రామంలో ‘పంచాయితీ’ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో మీడియా అక్కడకు చేరుకోవడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అక్కడే ఉన్న నలుగురు బాలలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధిత బాలికను తొలుత పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అత్యాచారం కేసు నమోదు : కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు
తేతలి గ్రామంలో మైనర్‌ బాలికపై నలుగురు బాలురు అత్యాచారం చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. తేతలిలో సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతోపాటు బాధిత బాలిక, తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలిక నుంచి సేకరించిన వివరాలు మేరకు నలుగురు బాలురపై 376 సెక్షన్‌ కింద అత్యాచారం కేసు నమోదు చేశామన్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చిన రిపోర్టులు ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top