విద్యార్థులే టార్గెట్‌

Marijuana Smuggling in Kurnool - Sakshi

గంజాయి విక్రేతలను పట్టుకున్న పోలీస

కర్నూలు:  విద్యార్థులే లక్ష్యంగా కర్నూలు నగరంలో  గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ధూమపానానికి అలవాటు పడిన విద్యార్థులు, గంజాయికి బానిసలుగా మారుతున్నారు.  నల్లమల అటవీ ప్రాంతం నుంచి  గంజాయి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటవ పట్టణ సీఐ దస్తగిరిబాబు నేతృత్వంలో వలపన్ని నలుగురు రవాణా దారులు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేశారు.  జొహరాపురానికి  చెందిన మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మల్లెపోగు మధు గంజాయిని  పొట్లాలుగా కట్టి అదే ప్రాంతంలోని అల్లాబకాష్‌ దర్గా  వెనుక విద్యార్థులకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. వెలుగోడు మండలం రాజునగర్‌ వీధికి చిందిన ఖాదర్‌వలి, పాణ్యం ఏఆర్‌ కాలనీకి చెందిన మూర్తుజావలి, పగిడ్యాల మండలం వనుములపాడు గ్రామానికి చెందిన కర్నే దామోదర్, బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు గ్రామానికి చెందిన ఖైరున్‌బీ  ముఠాగా ఏర్పడి  నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయిని  తీసుకొచ్చి  మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మధుకు  రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో  బయటపడింది. 

వీరు కిలో గంజాయి 500 ప్రకారం కొని తులాల ప్రకారం పొట్లాలుగా చుట్టి  ఒక్కొక్కటి రూ.20 ప్రకారం విద్యార్థులకు విక్రయాలు జరుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కర్నూలు నగరంలోని ఎల్కూరు విల్లాస్, ప్రధాన పార్కులు, ఇంజినీరింగ్‌ కాలేజీల వద్ద ఈ వ్యాపారాని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడినట్లు  సీఐ దస్తగిరి బాబు తెలిపారు. సిగరెట్లు తాగే అలవాటు ఉన్న విద్యార్థులు అందులోని పొగాకు  తొలగించి గంజాయి పొడిని నింపుకుని తాగుతున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రవాణా దారులు కర్నే దామోదర్, ఖాదర్‌వలి, మూర్తుజావలి, ఖైరూన్‌బీలతో పాటు, జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, మల్లెపోగుమ«ధును అరెస్టు చేసిæ వారి వద్ద 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసురేని కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు సీఐ వెల్లడించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top