డబ్బులు పోయినా పట్టించుకోరా..? | Man Sit Protest In Front Of SBI Bank Over Money Missing In His Bank Account | Sakshi
Sakshi News home page

డబ్బులు పోయినా పట్టించుకోరా..?

Sep 28 2019 11:23 AM | Updated on Sep 28 2019 11:23 AM

Man Sit Protest In Front Of SBI Bank Over Money Missing In His Bank Account - Sakshi

మద్నూర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితుడు, అతడి భార్య, బాధితులతో మాట్లాడుతున్న పోలీసులు  

సాక్షి, నిజామాబాద్‌(మద్నూర్‌) : పది రోజుల క్రితం బ్యాంకు ఖాతా నుంచి రూ. 1.50 లక్షలు విత్‌డ్రా అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ మద్నూర్‌ మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఎదుట శుక్రవారం బాధితుడు నారాయణ ధర్నాకు దిగాడు. బ్యాంకులో ఉంచిన డబ్బులు నా అనుమతి లేకుండా ఎలా ఇతరుల అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా అకౌంట్‌ నంబర్‌ గాని, ఏటీఎం కార్డు నంబర్‌ కాని ఎవ్వరికి చెప్పలేదని, ఫోన్‌ చేసి వివరాలు ఎవ్వరు కూడా వివరాలు అడగలేదని తెలిపాడు. అయితే తన అకౌంటు నుంచి రూ.1.50 లక్షలు విత్‌డ్రా అయ్యాయని బాధితుడు వాపోయాడు. ఈ విషయమై నిజామాబాద్‌లోని జిల్లా ఎస్‌బీఐ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోకనే బ్యాంకు ఎదుట ధర్నా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. పైసా పైసా కష్టపడి డబ్బు కూడబెట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ వెంకట్రావ్‌ సిబ్బందితో కలిసి బ్యాంకు వద్దకు చేరుకుని బాధితుడిని సముదాయించి బ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. నారాయణకు చెందిన ఏటీఎం కార్డు, పిన్‌ నెంబరు ఇతరులకు తెలియడంతోనే డబ్బు విత్‌డ్రా జరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. పంజాబ్‌లోని పాటియాల జిల్లాలో డబ్బు విత్‌డ్రా జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయమై బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని సైబర్‌ క్రైం బ్యాంచ్‌ పోలీసులు కేసును చేదించి న్యాయం చేస్తారని ఏఎస్సై తెలపడంతో బాధితుడు వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోని సైబర్‌ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని బాధితుడు అన్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement