బ్యాటింగ్‌ ఇవ్వలేదని కత్తితో దాడి..

Knife Attack On Man In Kota Rajasthan - Sakshi

కోటా: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్‌లో బ్యాటింగ్‌ అవకాశం ఇవ్వలేదని ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటంతో ఆ యువకుడు మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్‌ కుమార్‌సింగ్‌ (17) కోటా నగరంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్‌ పరీక్ష కోసం మూడేళ్ల నుంచి కోచింగ్‌ తీసుకుంటున్నాడు. రాహుల్‌ భటీ అనే స్థానికుడు తన మిత్రులతో కలసి శనివారం సాయంత్రం క్రికెట్‌ ఆడుతుండగా తనకు బ్యాటింగ్‌ అవకాశం ఇవ్వమని అతుల్‌ వారిని అడిగాడు.

సమ్మతించిన వారు బ్యాటింగ్‌ అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని ఓవర్ల తర్వాత బ్యాటింగ్‌ ఇవ్వమంటే అతుల్‌ ఒప్పుకోలేదు. మరికొన్ని బాల్స్‌ వేయమని కోరాడు. చిన్నగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఆగ్రహానికి గురైన రాహుల్‌ తన దగ్గరున్న కత్తితో అతుల్‌ను పొడిచాడు. తీవ్రగాయాలపాలైన అతుల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టు ఎదుట హాజరుపరచడంతో.. 3 రోజుల కస్టడీ విధించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top