ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

Girl Protest Infront Of Boyfriend House In Mahabubnagar - Sakshi

మిడ్జిల్‌ (జడ్చర్ల): తనను పెళ్లి చేసుకోవాలని ఓ బాలిక ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ సంఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన బాలిక(17) మహబూబ్‌నగర్‌లో ఇంటర్‌ చదువుతుండగా.. అదే గ్రామానికి చెందిన మహేష్‌(21) అనే యువకుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ నెల 8వ తేదీన గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా.. యువకుడి తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు.

అనంతరం యువకుడి కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారయ్యారు. తనను ప్రేమించి మోసం చేసిన మహేష్‌తో పెళ్లి జరిపించాలని బాలిక ఆదివారం గ్రామంలో యువకుని ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈమెకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన మహేష్‌తో పెళ్లి జరిపించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి యువకుడిపై కేసు నమోదు చేస్తామని బాలికకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. యువకుడితో తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు భీంరాజ్, గణేష్, రాజు తదితరులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top