ఒంటరి మహిళలే టార్గెట్‌

Chain Snatcher Arrest in Hyderabad - Sakshi

నేరేడ్‌మెట్‌: బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ అతి చిన్న కత్తితో  ఒంటరి మహిళలను బెదిరించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువకుడిని ఎల్‌బీ.నగర్‌  సీసీఎస్, క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రం, బివాని జిల్లా, బర్సి గ్రామానికి చెందిన ఖుసారియా దతారామ్‌ బాలాపూర్‌లోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉంటూ కొత్తపేటలోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.  

డ్యూటీ ముగిసిన అనంతరం బైక్‌పై ఎల్‌బీనగర్, సరూర్‌నగర్, మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ..ఒంటరి మహిళలు, యువతులను వెంబడించి చెయిన్‌ స్నాచింగ్‌కు పాల్పడటంతోపాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.  కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం ఎల్‌బీ.నగర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన దతారామ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు అంగీకరించాడు.  అతడి నుంచి బుల్లి కత్తి, రూ.35వేల విలువైన చోరీ సొత్తుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఇన్‌చార్జి డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top