పెద్దాస్పత్రిలో బిడ్డ మాయం

Birth Child Kidnap In Kolaru Hospital Karnataka - Sakshi

కోలారు జిల్లాస్పత్రిలో కలకలం

మిన్నంటిన తల్లి రోదన

జిల్లాలో 4 నెలల్లో రెండో మిస్సింగ్‌

ఎస్పీ కటౌచ్‌ తనిఖీ

ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి నడిచివచ్చిందని అందరూ సంతోషించారు. కానీ ఆనందం కొన్ని గంటల్లో మాయమైంది. తల్లీబిడ్డ గాఢనిద్రలో ఉండగా పాప అదృశ్యమైంది. ఈ హఠాత్పరిణామంతో తల్లి కన్నీటి పర్యంతమైంది. బిడ్డ కోసం తల్లి మనసు  తపిస్తోంది.

కోలారు: కోలారు నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నవజాత శిశువు కిడ్నాప్‌కు గురైంది. ముళబాగిలు తాలూకా వమ్మసంద్ర గ్రామానికి చెందిన వేణుకుమారి అనే కూలీ మహిళ రెండవ కాన్పుకోసం కోలారు ఎస్‌ఎన్‌ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం ఆడ శిశువుకు  జన్మనిచ్చింది. బుధవారం రాత్రి బిడ్డతో కలిసి నిద్రించింది, గురువారం తెల్లవారుజామున మెలకువ వచ్చాక చూస్తే బిడ్డ కనిపించలేదు. దీంతో తల్లి గట్టిగా రోదించడంతో సిబ్బంది వచ్చి శిశువు అదృశ్యమైన విషయాన్ని గుర్తించారు. శిశువు తండ్రి తండ్రి, బంధువులు వెతికినా ఫలితం లేక పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో సిసి కెమెరాలు ఉన్నప్పటికీ శిశువు అదృశ్యమైన దృశ్యం వాటిలో కనిపించలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే బిడ్డ మిస్సింగ్‌కు కారణమని కుటుంబీకులు పోలీసుల ముందు ఆరోపించారు.

ఎస్పీ పరిశీలన
గురువారం ఉదయం జిల్లా ఎస్పీ రోహిణి కటౌచ్‌ ఆస్పత్రికి వచ్చి బాలింతతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సిబ్బందితోనూ వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో తగిన భద్రత ఉన్నా శిశువు కిడ్నాప్‌ కావడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎస్పీ తెలిపారు. శిశువు గాలింపునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పరుస్తామని చెప్పారు. సంఘటనకు ముందు ఇద్దరు పురుషులు అనుమానాస్పదంగా ప్రసూతి వార్డు వద్ద తిరుగుతున్న విషయాన్ని పలువురు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారిని గుర్తిస్తే శిశువు ఆచూకి సులువుగా లభిస్తుందని పోలీసులు అంటున్నారు. 

తల్లి రోదన
శిశువు తల్లి వేణుకుమారి తనకు బిడ్డను అందించాలని కన్నీరుమున్నీరుగా రోదించింది. బాలింత అత్త మునియమ్మ మాట్లాడుతూ ధర్మాసుపత్రిలో ధర్మం ఎక్కడుందని, శిశువును కోల్పోయిన తాము  పుట్టెడు దుఃఖంలో ఉంటే తమ పైనే నిందలు వేస్తున్నారని ఆస్పత్రి సిబ్బందిని దుయ్యబట్టింది.

నాలుగు నెలల్లో రెండో మిస్సింగ్‌
గత నాలుగు నెలల్లో రెండోసారి నవజాత శిశువు అపహరణ  చోటు చేసుకుంది. గత నాలుగు నెలల క్రితం కేజీఎఫ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు కిడ్నాప్‌కు గురైంది. ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. ఇంతలోనే ఏకంగా జిల్లా ఆస్పత్రిలో మరో సంఘటన జరగడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆస్పత్రి ముందు ధర్నా  
జిల్లా ఆస్పత్రి ముందు కిడ్నాప్‌కు గురైన శిశువు తల్లితో పాటు మానవ హక్కుల జాగృతి సమితి కార్యకర్తలు నిరసన నిర్వహించారు. కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో పదేపదే శిశువు కిడ్నాప్‌లకు గురౌతుండి వీటిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. శిశువు తల్లికి న్యాయం జరిగే వరకు ఆందోళణ విరమించేది లేదని పట్టుబట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top