ఇళ్లల్లోకి దుర్వాసన రావడంతో... | Animals Dead Bodies in Shed Rangareddy | Sakshi
Sakshi News home page

షెడ్‌ నిండా జంతు కళేబరాలు!

Mar 3 2020 8:20 AM | Updated on Mar 3 2020 9:55 AM

Animals Dead Bodies in Shed Rangareddy - Sakshi

షెడ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు, అధికారులు

రంగారెడ్డి, కొత్తూరు: జంతు కళేబరాలతో కంపు కొడుతున్న ఓ షెడ్‌కు అధికారులు తాళం వేశారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని ఓ షెడ్‌లో జంతుకళేబరాలను నిల్వ చేయడంతో ఇళ్లల్లోకి దుర్వాసన వస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం షెడ్‌ను పరిశీలించిన అధికారులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న జంతు కళేబరాలను చూసి అవాక్కయ్యారు. తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, పోలీసులు షెడ్‌లోని జంతుకళేబరాలతో తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. అధికారులు వచ్చే సరికి షెడ్‌లో పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు.

ఇతర ప్రాంతాల నుంచి డీసీఎంలో తెచ్చిన జంతుకళేబరాలు, అవయవాలు
దీంతో షెడ్‌కు తాళం వేసినఅనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఏపీకి చెందిన కొంతమంది వ్యాపారులు తిమ్మాపూర్‌ శివారులో హరిప్రోటీన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ షెడ్‌ను అద్దెకు తీసుకొని దాంట్లో జంతుకళేబారాలతో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కాగా ఉత్పత్తుల తయారీ కోసం అన్ని శాఖల అనుమతులు తీసుకున్నారా..? ఇక్కడ కళేబరాలు, అవయవాలతో వంటనూనె తయారు చేస్తున్నారా..? లేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారా.?  అనే విషయాలు తెలాల్సి ఉందన్నారు. షెడ్‌లో తయారు చేస్తున్న ఉత్పత్తుల విషయాన్ని తాను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహసీల్దార్‌ చెప్పారు. ఇదిలా ఉండగా నిర్వాహకుల్లో కొందరు మాట్లాడుతూ.. తాము జంతుకళేబరాలతో వంటనూనె తయారు చేయడం లేదన్నారు. ఆక్వాఫుడ్‌(చేపల ఆహారం) ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement