8 టన్నుల ఒంటె మాంసం పట్టివేత

8 tons of camel meat siege - Sakshi - Sakshi - Sakshi

నాలుగు లారీలు,  రెండు కార్లు సీజ్‌ 

వ్యాపారులు,  పలువురు యువకుల అరెస్ట్‌ 

మునుగోడు: పచ్చని పొలాల నడుమ రక్తం ఏరులై పారింది. పదునైన కత్తులు, గొడ్డళ్లతో వధిస్తుంటే మూగజీవాల వేదన..అరణ్య రోదనగా మారింది. నల్లగొండ జిల్లా మనుగోడు మండలం ఊకొండిలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఒంటెలను వధిస్తున్న ముఠాను పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. హైదరాబాద్‌కు రవాణా చేసేందుకు సిద్ధం చేసిన 8 టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ కాచిగూడకు చెందిన అఫ్జల్, మలక్‌పేటకు చెందిన ఫరీద్‌ కొంతకాలంగా ఒంటె మాంసం వ్యాపారం చేస్తున్నారు.

వీరు నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పరు చుకున్నారు. రాత్రి సమయంలో ఒంటెలను కోసేందుకు అనువైన స్థలం కావాలని అడిగారు. దీంతో ఖయ్యూం తనకు నిత్యం పశువులని విక్రయించే అదే మండలం ఊకొండి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ నిమ్మల స్వామిని ఆ«శ్రయించగా.. తన భూమిని వాడుకోండని చెప్పాడు. దీంతో వ్యవసాయ భూమిలో ఒంటెలను వధించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి రెండు లారీలు, డీసీఎంల (మధ్యప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్నవి)లో 28 ఒంటెలను వ్యవసాయక్షేత్రం వద్దకు తీసుకొచ్చారు.

వాటిని వధించేందుకు కోల్‌కతా, హైదరాబాద్, అసోం, నాగాలాండ్‌కు చెందిన 25 మంది యువకులను కూడా వెంట తీసుకువచ్చారు. రాత్రి 11.30 గంటల తర్వాత ఒంటెలను వధించడం మొదలుపెట్టారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మునుగోడు ఎస్‌ఐ రాములు తన సిబ్బందితో అర్ధరాత్రి ఘటనాస్థలికి చేరుకోగా.. అప్పటికే 22 ఒంటెలను కోశారు. సుమారు ఎనిమిది టన్నుల మాంసాన్ని డీసీఎంలలో లోడ్‌ చేశారు. కాగా, పోలీసులను చూసి వ్యాపారులు, యువకులు పారిపోయారు. లారీలో ఉన్న ఆరు ఒంటెలను కిందికి దింపారు. అందులో ఒకటి చనిపోయింది. కాగా, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు లారీలతోపాటు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top