రిటైల్ ధరలు తగ్గాయ్ | Sakshi
Sakshi News home page

రిటైల్ ధరలు తగ్గాయ్

Published Fri, Jun 13 2014 2:16 AM

రిటైల్ ధరలు తగ్గాయ్

న్యూఢిల్లీ: కూరగాయలు, తృణధాన్యాలు, డెయిరీ ఉత్పత్తుల ధరలు కాస్త దిగిరావడంతో రిటైల్ ద్రవ్యోల్బణం శాంతించింది. మే నెలలో 8.28 శాతంగా నమోదైంది. ఇది మూడు నెల ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. రిటైల్ ధరల ఆధారంగా లెక్కించే ఈ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 8.59%గా ఉంది. కాగా, మే నెలలో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 9.56%కి చేరింది. ఏప్రిల్‌లో 9.66 శాతంగా ఉంది. ఇక కూరగాయల ధరల పెరుగుదల రేటు ఏప్రిల్‌లో 17.5%కాగా, మే నెలలో 15.27%కి తగ్గింది. తృణధాన్యాల ధరల పెరుగుదల రేటు 9.67% నుంచి 8.81 శాతానికి దిగొచ్చింది. అదేవిధంగా పాలు, పాల ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు కూడా 11.42% నుంచి 11.28 శాతానికి చేరింది.
 
త్వరలో కొత్త ద్రవ్యోల్బణ బాండ్‌లు...
గతంలో ప్రవేశపెట్టిన ద్రవ్యోల్బణ సూచీ(ఇన్‌ఫ్లేషన్) ఆధారిత బాండ్‌లకు స్పందన అంతగారాకపోవడంతో త్వరలో వీటిని మరింత మెరుగుపరిచి జారీచేయనున్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ చెప్పారు. నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు భారత్‌లో తొలి పేమెంట్ బ్యాంక్ త్వరలో ఏర్పాటు కానుందని ఖాన్ చెప్పారు. డిపాజిట్, పేమెంట్ సేవలందించే ఈ బ్యాంక్‌లో రుణ సదుపాయం ఉండదన్నారు.

Advertisement
Advertisement