
రిలయన్స్ ఎల్పీజీ విక్రయ అనుమతులు పొడిగింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే ద్రవీకృత గ్యాస్ (ఎల్పీజీ)లో 1.2 లక్షల టన్నుల పరిమాణాన్ని...
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే ద్రవీకృత గ్యాస్ (ఎల్పీజీ)లో 1.2 లక్షల టన్నుల పరిమాణాన్ని ప్రైవేట్ వంట గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు విక్రయించుకునేందుకు ఇచ్చిన అనుమతుల గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా ప్రభుత్వం పొడిగించింది. ఇందుకు సంబంధించి చమురు శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. అయితే, ప్రస్తుత ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించవచ్చని చమురు శాఖ పేర్కొంది.
దేశీయంగా వంటగ్యాస్కి కొరత ఉన్నందున ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్ కింద స్థానికంగా ఉత్పత్తి చేసే వంట గ్యాస్ను తప్పనిసరిగా ప్రభుత్వ రంగ రిటైలింగ్ సంస్థలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మార్కెట్ రేటును ఇవ్వడం లేదంటూ.. సమాంతర మార్కెటింగ్ పథకం (పీఎంఎస్) కింద ప్రైవేట్ కంపెనీలకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విక్రయిస్తోంది. ఈ తరహా రిటైలింగ్ను ఆపేయాలంటూ గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించగా.. దాన్ని ఆర్ఐఎల్ సవాలు చేసింది.