
ఈ ఏడాది గరిష్ట స్థాయికి ముడి చమురు ధరలు
ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో బ్యారెల్ చమురు ధరలు 51 డాలర్లను మించి పోయాయి.
అమెరికాలో క్షీణించిన చమురు నిల్వలు
లండన్: ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో బ్యారెల్ చమురు ధరలు 51 డాలర్లను మించి పోయాయి. చైనా వృద్ధిపై ప్రోత్సాహకర నివేదికలు రావడం, ముడి చమురు సరఫరాలు తగ్గడం, జూన్ 3న ముగిసిన వారంలో అమెరికా ముడి చమురు నిల్వలు 3.2 మిలియన్ బ్యారెళ్లు తగ్గాయన్న గణాంకాలు, అమెరికా డాలర్ పతనమవుతూ ఉండటం వంటివి దీనికి కారణాలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం ఈ ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఈ ధరలు 90 శాతం ఎగిశాయి. అడవుల్లో చెలరేగిన దావానలం కారణంగా కెనడాలో, నైజీరియాలో చమురు ప్లాంట్లపై మిలిటెంట్ గ్రూప్ల దాడుల కారణంగా చమురు ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణాలని నిపుణులంటున్నారు. ఈ వార్త రాసే సమయానికి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 52.34 డాలర్లకు(గత ఆక్టోబర్ నుంచి చూస్తే ఇదే అధిక ధర) పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్ ధర 2 శాతం పెరిగి 51.34 డాలర్లకు ఎగసింది.