మార్గదర్శి లక్ష్యం రూ.20 వేల కోట్లు | Margadarsi Chit Fund reaches Rs 10000 crore in turnover | Sakshi
Sakshi News home page

మార్గదర్శి లక్ష్యం రూ.20 వేల కోట్లు

Jun 21 2018 12:38 AM | Updated on Jun 21 2018 12:38 AM

Margadarsi Chit Fund reaches Rs 10000 crore in turnover - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మార్గదర్శి చిట్‌ఫండ్‌ రూ.10,204 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంది. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.10,800 కోట్లు.. 2025 నాటికి రూ.20 వేల కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచామని కంపెనీ ఎండీ శైలజా కిరణ్‌ చెప్పారు.

మార్గదర్శి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారమిక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు.  ‘‘1962లో హిమాయత్‌నగర్‌లో బ్రాంచీతో ఆరంభమైన మార్గదర్శికి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 105 బ్రాంచీలున్నాయి.

ఈ ఏడాది కొత్తగా మరో ఆరింటిని ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. ప్రస్తుతం రూ.50 వేల నుంచి రూ.80 లక్షల వరకు చిట్స్‌ ఉన్నాయని త్వరలోనే కోటి రూపాయల చిట్‌ను ప్రారంభిస్తామని తెలియజేవారు. చిట్‌గ్రూప్‌ను బట్టి ఏడాదికి ఒకో చిట్‌పై 6–8 శాతం రాబడి ఉంటుందన్నారు. తమ వ్యాపారంలో 70 శాతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచేనన్నారు. ప్రస్తుతం సంస్థలో 15,786 మంది ఏజెంట్లు, 4,300 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఎన్‌బీఎఫ్‌సీగా..
చిట్‌ఫండ్‌ నుంచి బ్యాంక్‌కు మారే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘‘బ్యాంక్‌ ఏర్పాటు వైపు ఆలోచనైతే లేదు గానీ.. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలోకి అడుగుపెట్టే అవకాశముందని చెప్పారామె. దీనికి కొంత సమయం పట్టొచ్చన్నారు.

బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వడ్డీ ఆదాయంపై జీఎస్టీ విధించడం లేదని, చిట్‌ఫండ్‌కు మాత్రం 12 శాతం పన్ను విధించడం సరైంది కాదని, కస్టమర్లకు భారంగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. చిట్‌ఫండ్‌ పరిశ్రమకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించామని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement