‘ఈక్విటీ’ నిధులు @ రూ.63,744 కోట్లు

Fund-raising via equity market routes plunges 60% in 2018 - Sakshi

గత ఏడాదితో పోలిస్తే 60% క్షీణత

నిధుల సమీకరణలో అగ్రస్థానంలో ఐపీఓలు

ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఈ ఏడాది వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా రూ.63,744 కోట్లు సమీకరించాయి. గత ఏడాది సమీకరించిన రూ.1.6 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే ఇది 60 శాతం తక్కువని డేటా ఎనలిటిక్స్‌ సంస్థ, ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...,  

► ఈక్విటీ ద్వారా కాకుండా బాండ్ల ద్వారా కంపెనీలు మరో రూ.29,944 కోట్లు సమీకరించాయి.  
► ఈ ఏడాది నిధుల సమీకరణ జరిగిన వివిధ ఈక్విటీ మార్గాల్లో అత్యధిక నిధులు ఐపీఓ మార్గంలో వచ్చాయి. ఈ మార్గంలో 24 కంపెనీలు రూ.33,244 కోట్లు సమీకరించాయి. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు సగం. గత ఏడాది మొత్తం 36  కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి.  
► కంపెనీలు ఈ ఏడాది క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా రూ.16,077 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.10,678 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) ద్వారా రూ.3,145 కోట్లు       సేకరించాయి.  
► గత ఏడాది ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో సమీకరించిన నిధులు రూ.18,094 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇది రూ.10,678 కోట్లకు తగ్గింది.  
►  ఈ ఏడాది అతి పెద్ద ఓఎఫ్‌ఎస్‌గా కోల్‌ ఇండియా ఇష్యూ(రూ.5,274 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1,848 కోట్లతో లార్సెన్‌ అండ్‌ టుబ్రో ఇష్యూ నిలిచింది.  
►  క్యూఐపీ నిధుల సమీకరణ కూడా 73 శాతం తగ్గింది. గత ఏడాది ఈ విధానంలో రూ.61,148 కోట్లు రాగా, ఈ ఏడాది 73 శాతం తగ్గి రూ.16,677 కోట్లు మాత్రమే వచ్చాయి. అతి పెద్ద క్యూఐపీగా రూ.3,500 కోట్ల ఐడియా క్యూఐపీ నిలిచింది.  
► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా రూ.4,473 కోట్ల బంధన్‌బ్యాంక్‌ ఐపీఓ నిలిచింది.  
►  ఈ ఏడాది ఎస్‌ఎమ్‌ఈల (స్మాల్, మీడియమ్‌ ఎంటర్‌ప్రైజ్‌) కార్యకలాపాలు గత ఏడాది కంటే జోరుగా ఉన్నాయి. ఈ ఏడాది ఎస్‌ఎమ్‌ఈలు ఐపీఓ విధానంలో రూ.2,254 కోట్లు సమీకరించగా, గత ఏడాది ఈ సమీకరణ రూ.1,679 కోట్లుగా మాత్రమే ఉంది.

161 ఐపీఓలు @ 552 కోట్ల డాలర్లు: ఈవై
కాగా, ఈ ఏడాది అత్యధిక ఐపీఓలు వచ్చిన స్టాక్‌ ఎక్సే్చంజ్‌లుగా భారత స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు రెండో స్థానంలో నిలిచాయని ఈవై తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబర్‌ నెల చివరి వరకూ మొత్తం 161 ఐపీఓలు వచ్చాయని, ఈ ఐపీఓలు 552 కోట్ల డాలర్లను సమీకరించాయని ఈవై ఇండియా ఐపీఓ ట్రెండ్స్‌ నివేదిక పేర్కొంది. ఈ క్యూ3లో 9 ఐపీఓలు రాగా, ఈ క్యూ4లో రెండు ఐపీఓలు మాత్రమే వచ్చాయని వివరించింది. ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓల్లో కూడా ఇదే ధోరణి చోటు చేసుకుంది. ఈ క్యూ3లో 42గా ఉన్న ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓలు ఈ క్యూ4లో ఎనిమిదికి తగ్గాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో 261 ఐపీఓలు 6,000 కోట్ల డాలర్లు సమీకరించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top