పీఎన్‌బీ స్కాంపై మౌనం వీడిన జైట్లీ | Arun Jaitely Says PNB Scam Failure Of Auditors, Management | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాంపై మౌనం వీడిన జైట్లీ

Feb 20 2018 8:13 PM | Updated on Oct 2 2018 4:19 PM

Arun Jaitely Says PNB Scam Failure Of Auditors, Management - Sakshi

పీఎన్‌బీ స్కాంపై జైట్లీ ప్రకటన

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మౌనం వీడారు. ఈ స్కాంపై తొలిసారి స్పందించారు. ఈ స్కాంలో ఆడిటర్లు, బ్యాంకర్లనే జైట్లీ నిందించారు. పీఎన్‌బీలో చోటుచేసుకున్న ఈ రూ.11,400 కోట్ల కుంభకోణానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ''నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజ్‌మెంట్‌కి ఉంటే, దాన్ని సమర్థవంతంగా, సరియైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఒకవేళ దానిలో ఏమైనా లోపాలు గుర్తిస్తే, దానికి వారే బాధ్యత వహించాలి'' అని జైట్లీ ఏడీఎఫ్‌ఐఏపీ వార్షిక సమావేశంలో అన్నారు. ఆడిటర్లు ఏం చేస్తున్నారు? అంతర్గత, బహిర్గత ఆడిటర్లు దీన్ని గుర్తించడం విఫలమైతే, సీఏ నిపుణులు గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉందని భావిస్తున్నా అని పేర్కొన్నారు.

బ్యాంకుల నిర్వహణపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకుల సిస్టమ్‌ నమ్మకం, రుణగ్రహీత, రుణదాత రిలేషన్‌షిప్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. కాగ, పీఎన్‌బీలో నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి  రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి వచ్చాక, ఈడీ, సీబీఐ వీరి సంస్థలపై భారీ ఎత్తున్న తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో 120 షెల్‌ కంపెనీలు పాలుపంచుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో 80 కంపెనీలు నీరవ్‌ మోదీ, చౌక్సి రన్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులో భాగమైన మెహుల్‌ చౌక్సి ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి జెమ్స్‌, దాని అసోసియేటెడ్‌ సంస్థలపై ఐటీ కూడా దాడులు చేసింది. ముంబై, పుణే, సూరత్‌, హైదరాబాద్‌, బెంగళూరు వంటి పలు నగరాల్లో ఉన్న కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement