పొట్టకూటి కోసం వెళ్లి పరలోకాలకు...

YSR Kadapa Local Person Died in Kuwait - Sakshi

కువైట్‌లో కృష్ణంరాజు అనుమానాస్పద మృతి

మరణ వార్త తెలియడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు

మృతదేమాన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్న  కుటుంబీకులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, లక్కిరెడ్డిపల్లె : మండల పరిధిలోని బి.యర్రగుడి పంచాయతీ కాపుపల్లెకు చెందిన దేరంగుల కృష్ణంరాజు(30) బుధవారం రాత్రి కువైట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... 2018వ సంవత్సరంలో కృష్ణంరాజు బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. వచ్చే నెలలో తిరిగి ఇండియాకు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. అయితే కువైట్‌కు వెళ్లినప్పటి నుండి సేఠ్‌ వద్దనే పని చేస్తూండే వాడు. ఈ మధ్య కాలంలో ఎలాంటి సమస్యలు లేవని.. సంతోషంగా ఉన్నానని చెబుతూ కుటుంబం ఖర్చుల కోసం డబ్బులను కూడా పంపించేవాడు. ప్రతి రోజూ వీడియో కాల్‌ ద్వారా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలతో సంతోషంగా మాట్లాడేవాడు. చివరి సారిగా బుధవారం  గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా ఆ సమయంలో కూడా ఫోన్‌ చేసి పెళ్లి వేడుకపై అడిగి తెలుసుకున్నాడు.  గురువారం ఫోన్‌ రాకపోవడంతో కృష్ణంరాజు భార్య ఫోన్‌ చేయగా మరో వ్యక్తి ఫోన్‌ తీసి మీ భర్త  మృతి చెందినట్లు తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

కుటుంబానికిపెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే...
కాపుపల్లెకు చెందిన దేరంగుల చిన్న వెంకటరమణ, సావిత్రి దంపతుల చిన్న కుమారుడు కృష్ణంరాజు మృతితో ఆ  కుటుంబంలో విషాదం నెలకొంది.  మూడేళ్ల క్రితం మానసా అనే యువతిని  కృష్ణంరాజు ప్రేమించి వివాహం  చేసుకున్నాడు.  ఏడాదికే పాప దివ్యశ్రీ జన్మించడంతో కుటుంబానికి అదనపు సంపాదన కోసం కువైట్‌కు వెళ్లాడు.  అక్కడ  రూ.3 లక్షలు నగదు, కొంత బంగారం ,  కొన్ని వస్తువులు తీసుకున్నట్లు   కృష్ణంరాజు తెలిపినట్లు భార్య తెలిపింది. ఉన్నట్లుండి మరణవార్త వినగానే భార్య మానస, తల్లి సావిత్రి, కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.  మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కటుంబ సభ్యులు  ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

విలపిస్తున్న మృతుడి తల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top